Telangana: రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు

27 Sep, 2022 03:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. గతంలోనే వీటికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అయింది. తాజాగా ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్‌ 3) ప్రకారం ఈ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ మండలాలన్నీ సెప్టెంబర్‌ 26, 2022 నుంచి ఉనికిలోకి వస్తాయి. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫైనల్‌ గెజిట్‌లో పేర్కొంటున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. జగిత్యాల, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 607 మండలాలు ఉండగా, ఇప్పుడు మరో 13 కొత్తగా ఏర్పాటు కావడంతో రెవెన్యూ మండలాల సంఖ్య 620కి చేరింది.  

మరిన్ని వార్తలు