ఆదిలాబాద్‌: ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లాడిన వరుడు

19 Jun, 2021 17:19 IST|Sakshi

ఆదిలాబాద్‌: జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒకే పందిరి కింద ఇద్దరు యువతులకు తాళి కట్టాడో వరుడు. పెళ్లికుమార్తెలు ఇద్దరూ వరసకు అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. జూన్‌ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఉట్నూర్‌ మండలంలోని ఘనపూర్‌ గ్రామానికి చెందిన అర్జున్‌ బీఈడీ పూర్తిచేశాడు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు.

కాగా మేనత్త కుమార్తె ఉషా రాణితో అతడు ప్రేమలో పడ్డాడు. అయితే, ఆమెతో ప్రేమ బంధం కొనసాగిస్తూనే, మరో మేనత్త కూతురు సురేఖపై కూడా ఇష్టం పెంచుకున్నాడు. సదరు యువతులు ఇద్దరూ కూడా ఒకరికి తెలియకుండా మరొకరు అర్జున్‌ను ప్రేమిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అతడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించగా.. అసలు విషయం బయటపడింది. తాను ఇద్దరినీ పెళ్లాడతానని అర్జున్‌ తన తల్లిదండ్రులకు చెప్పాడు. 

ఇక ఈ విషయంపై అభిప్రాయం కోరగా ఆ యువతులు బావనే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో మూడు కుటుంబాల పెద్దలు చర్చించి, ఒకే మండపంలో అర్జున్‌కు ఉషా రాణి, సురేఖలతో వివాహం జరిపించారు. ఈ ఘటన గురించి స్థానిక ఎంపీపీ పండ్రా జయవంతరావు ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయంలో ఇలాంటి పెళ్లిళ్లు సాధారణమే అని పేర్కొన్నారు. ‘‘వాళ్లిద్దరూ అతడిని పెళ్లి చేసుకునేందుకు తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. కాబట్టి ఎలాంటి ఆటంకం లేకుండా తంతు ముగిసింది. ఇక్కడ ఇవన్నీ సహజమే’’ అని చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

చదవండి: కాసేపట్లో పెళ్లి కూతురి మెడలో తాళి.. ఆపాలంటూ పోలీసుల ఎంట్రీ

మరిన్ని వార్తలు