మరో నాలుగు కొత్త మెడికల్‌ కాలేజీలు

14 Sep, 2021 04:17 IST|Sakshi

వికారాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, కామారెడ్డిలో ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైద్య విద్య పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వచ్చే ఏడాది నుంచి 7 వైద్య కళాశాలలు అందుబాటులోకి రానుండగా, ఆ తర్వాత ఏడాది అంటే.. ఎన్నికల నాటికి మరో 4కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. వికారాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, కామారెడ్డిలలోనూ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని తాజాగా సీఎం నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 మెడికల్‌ కాలేజీలు ఉండగా, గతం లో ప్రకటించిన ఏడు (సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌) కలిపి మొత్తం 11 కొత్త కాలేజీలు రానుండటం విశేషం. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రస్తుత సంఖ్యకు రెట్టింపునకు పైగా కాలేజీలు రాష్ట్రంలో ఏర్పాటు కానుండటం గమనార్హం. ముఖ్యమంత్రి స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షిస్తుండటంతో ఇది సులభ సాధ్యమైందని అధికారులంటున్నారు. ఈ 11 కాలేజీల ద్వారా వచ్చే రెండేళ్లలో 1,650 ఎంబీబీఎస్‌ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి.  

ఏం కావాలో చెప్పండి 
వైద్య ఆరోగ్యశాఖపై ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. ‘వైద్య ఆరోగ్యశాఖ నా వద్దే ఉంది. అందువల్ల ఇప్పుడే వీలైనంత అభివృద్ధి పనులు చేపట్టండి. మీకు ఏం కావాలో చెప్పండి’ అని అన్నట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు