ఏపీ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు ఆపండి 

6 Jul, 2022 02:41 IST|Sakshi

కృష్ణాబోర్డును కోరిన తెలంగాణ 

చిత్రావతి, గోరకల్లుపై ఇప్పటికే అభ్యంతరం 

వాటితో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా నిలిపివేయాలని లేఖ 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర జలసంఘం (సీడ­బ్ల్యూ­సీ), కృష్ణా బోర్డు/అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి అ­ను­మతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులన్నింటినీ నిలుపుదల చేయించాల­ని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చే­సింది. రూ.60 వేల కోట్లతో ఆదాని గ్రీన్‌ ఎనర్జీ ప్రతిపాదించిన 3700 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపింది.

కడప జిల్లాలోని గండికోటలో 1000 మె­గా­వా­ట్లు, అనంతపురం జిల్లాలోని చిత్రావతిలో 500 మెగావాట్ల ప్రాజెక్టులను నిర్మించడానికి అనుమతిచ్చినట్టుగా పత్రికల్లో వార్తలొచ్చాయని, వీటి నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ తాజాగా కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.  

గతంలోనే వద్దన్నాం.. 
ఏపీ తమ రాష్ట్రంలోని కరువు ప్రాంతాల అవసరాలకని చెప్పుకుంటూ ..నీటి కొరత ఉన్న కృష్ణా బేసిన్‌ నుంచి తరలిస్తున్న జలాలను విద్యుదుత్పత్తి/పంప్డ్‌ స్టోరేజీ పథకా­లకు వినియోగించడం సరికాదన్నారు. చిత్రావతి, గోరకల్లు రిజర్వాయర్ల వద్ద ఏపీ నిర్మిస్తున్న పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు గతంలోనే అభ్యంతరం తెలిపామని, అనుమతులొచ్చే వరకు నిలుపుదల చేయాలని బోర్డుకు లేఖ సైతం రాసినట్టు గుర్తుచేశారు. ఈ రెండు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా నిలుపుదల చేయాలని కోరారు.  

కొత్త బ్యారేజీలనూ నిలిపివేయాలి 
ప్రకాశం బ్యారేజీ దిగువన ఏపీ రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి కసరత్తు చేస్తోందని, వీటిని­ర్మాణం కూడా చేపట్టకుండా ఆ రాష్ట్రాన్ని నిలువరించాలని ఈఎన్‌సీ మురళీధర్‌ మరో లేఖలో కృష్ణా బోర్డును కోరారు. ఈ బ్యారేజీలకు సంబంధించిన డీపీఆర్‌లను ఏపీ సిద్ధం చేసినట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను బోర్డుకు పంపించారు.   

మరిన్ని వార్తలు