తెలంగాణ అసెంబ్లీలో నవ్వులపువ్వులు

25 Mar, 2021 23:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి మాటలతో మళ్లీ అసెంబ్లీ ఘోల్లున నవ్వింది. ఆయన వ్యాఖ్యలతో స్పీకర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు విరగబడి నవ్వారు.. నవ్వుల పువ్వులు విరిసాయి. సీఎం కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశానికి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం మంత్రి మల్లారెడ్డి సభలో మాట్లాడారు.

ఈ సందర్భంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా కేసీఆర్‌ ప్రగతిపథంలోకి తీసుకెళ్తారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. కేసీఆర్‌ ప్రధాని అయితే ప్రజలకు సమస్యలే ఉండవని తెలిపారు. దేశ చరిత్ర మారిపోతుందని తెలిపారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ చూపు తెలంగాణ వైపు ఉందని పేర్కొన్నారు. మనం ఎదుగుతుంటే ఓర్వలేకుంటా.. అంటూ తడబడి ఇదే నా సవాల్‌ అని చెప్పడంతో ప్రతిపక్షంతో పాటు అధికార పక్షం సభ్యులు కూడా నవ్వారు. ఒక్కసారి.. ఒక్కసారి అంటూ సీఎం కేసీఆర్‌ను పీఎం కావాలని కోరారు. ఈ శాఖ పద్దు చాలా చిన్నది అని చమత్కరిస్తూనే సభ్యులందరూ సహకరించి ఆమోదం తెలపాలని మంత్రి మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు