సమావేశాల ఏర్పాట్లపై అధికారులతో స్పీకర్, మండలి ప్రొటెం చైర్మన్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 24న ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమవుతాయి. ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు తొలుత సంతాపాలు ప్రకటిస్తారు. తర్వాత ఇరు సభలు వాయిదా పడతాయి. అనంతరం అసెంబ్లీ స్పీకర్, మండలి ప్రొటెం ఛైర్మన్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలు జరుగుతాయి. అందులో సభల నిర్వహణ, సమావేశ తేదీలు, ఎజెండాలను ఖరారు చేస్తారు. 25, 26 తేదీల్లో సమావేశాలకు విరామం ప్రకటించి, తిరిగి 27వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
ఏర్పాట్లపై సమీక్ష
సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం శాసనసభ కమిటీ హాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్రెడ్డి సమీక్షించారు. శాసనసభ వ్యవహా రాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. సమావేశాల సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల తరఫున నోడల్ అధికారులు సభలో అందుబాటులో ఉండాలని.. గత సమా వేశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు జవాబులు అందజేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ఇక అధికార, విపక్ష సభ్యులనే తేడా లేకుండా ప్రజాసమస్యలపై చర్చలకు తగిన సమయాన్ని కేటాయిస్తామని ప్రొటెం చైర్మన్ వి.భూపాల్రెడ్డి చెప్పారు.
అసెంబ్లీ తొలిరోజు షెడ్యూల్ ఇదీ..
అసెంబ్లీలో శుక్రవారం మాజీ సభ్యుల మృతికి సంతాపాలు ప్రకటించిన అనంతరం మంత్రులు పలు ఆర్డినెన్సులు, నివేదికలను సమర్పించనున్నారు. రాష్ట్ర హౌజింగ్ బోర్డు సవరణ ఆర్డినెన్స్ను మంత్రి ప్రశాంత్రెడ్డి.. కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీ సవరణ ఆర్డినెన్స్ను నిరంజన్రెడ్డి సభ ముందు పెడతారు. ఇక రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మూడో వార్షిక నివేదికను మంత్రి తలసాని, ట్రాన్స్కో, డిస్కమ్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ల వార్షిక నివేదికను జగదీశ్రెడ్డి.. టూ రిజం అభివృద్ధి సంస్థ వార్షిక నివేదకను శ్రీనివాస గౌడ్, తెలంగాణ సమగ్ర శిక్ష అభియాన్ ఆడిట్ నివేదికను సబితా ఇంద్రారెడ్డి సభకు సమర్పిస్తారు.