ఒకటో తేదీకల్లా అసెంబ్లీ రెడీ 

21 Aug, 2020 02:19 IST|Sakshi
అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై చర్చిస్తున్న స్పీకర్‌ పోచారం, మండలి చైర్మన్‌ గుత్తా

సీటింగ్‌ ఏర్పాట్లపై అధికారులతో స్పీకర్, చైర్మన్‌ చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెల ఏడో తేదీ నుంచి మొదలుకానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల కోసం ఒకటో తేదీ కల్లా సభ్యుల సీటింగ్, ఇతర ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేయనుంది. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యుల బృందం గురువారం అసెంబ్లీ, మండ లి సమావేశ మందిరాలను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులతో చర్చించింది. భౌతికదూరం, సీటింగ్‌పై పలు సూచనలు చేసింది. 119 మంది సభ్యులు గల అసెంబ్లీలో 151 స్థానాలు ఉన్నాయి.

భౌతికదూరం నిబంధన నేపథ్యంలో అదనంగా మరో 42 సీట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందనే అంచనాకు అధికారులు వచ్చారు. గతంలో ఒక్కో సీటుకు ఇద్దరు సభ్యులు కూర్చోగా ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో సీటును ఒక్కో సభ్యుడికి కేటాయిస్తా రు. 40 మంది సభ్యులున్న మండలిలో ప్రస్తుతం 36 మంది ఉన్నారు. ఇందులో 80 సీట్లు ఉండటంతో ఏర్పాట్లకు ఇబ్బంది లేదని అసెంబ్లీ వర్గాలు వెల్లడించా యి. విజిటర్స్, ప్రెస్‌ గ్యాలరీని మీడియాకు కేటాయించే అవకాశం ఉంది. సీట్ల ఏర్పాటుపై స్పష్టత వచ్చాక ఎందరిని అనుమతించాలనే విషయంపై మీడియా అడ్వైజరీ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.  

మరిన్ని వార్తలు