సాక్షి, హైదరాబాద్: శాంతియుత పోరాటాలను అడ్డుకోవడం ద్వారా రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్న విషయాన్ని ప్రజాస్వామ్యవాదులు గమనించాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క కోరారు. గాంధీజయంతి రోజున విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. నిరసనలు తెలియజేయడం ప్రతిపక్షాల హక్కు అని, జంగ్ సైరన్ ఆందోళనను అడ్డుకోవాలనే ప్రయత్నం నిరంకుశత్వమేనని పేర్కొన్నారు. తమ పోరాటాలను లాఠీచార్జీలతో నిలువరించలేరని తెలిపారు.