ప్రజా సంగ్రామ యాత్ర 300కి.మీ. పూర్తి 

9 May, 2022 00:45 IST|Sakshi
ఆదివారం గంగాపూర్‌ వద్ద కేక్‌ కట్‌ చేస్తున్న బండి సంజయ్‌. చిత్రంలో పార్టీ శ్రేణులు  

జడ్చర్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం 300కి.మీ. పూర్తి చేసుకుంది. ఏప్రిల్‌ 14న జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నుంచి ప్రారంభమైన పాదయాత్ర 25వ రోజు ఆదివారం జడ్చర్ల మండలంలోని గంగాపూర్‌కు చేరుకుంది. 167నంబర్‌ జాతీయ రహదారిపై ‘300కి.మీ.’అని రాసి అక్కడే భారీ కేక్‌ను కట్‌ చేసిన సంజయ్, నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం ప్రసిద్ధి చెందిన లక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సీఎం నా చావు కోసం ఎదురుచూస్తున్నారు 
‘నా చావు కోసం సీఎం కేసీఆర్‌ ఎదురుచూస్తున్నారు. నేను మరణిస్తే నా కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయం అందిస్తానన్నారు. కానీ నేను మాత్రం ఆయన చావును కోరుకోవట్లేదు. ఆయన నిండు నూరేళ్లు బతకాలి. పేదలను మాత్రం మోసం చేయొద్దని కోరుతున్నా..’అంటూ బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం రాత్రి పది గంటలకు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌లో నిర్వహించిన ‘జనం గోస.. బీజేపీ భరోసా’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోది తెలంగాణ ప్రజల కోసం అనేక పథకాల కింద నిధులు మంజూరు చేస్తుంటే.. అవి పేదలకు అందకుండా కేసీఆర్‌ తన ఖాతాలో జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా ప్రజలకు చేరాలంటే ఒక్కసారి తమకు అధికారమివ్వాలని విజ్ఙప్తి చేశారు. 

మరిన్ని వార్తలు