7న ప్రధానితో బీజేపీ రాష్ట్ర నేతల భేటీ 

6 Jun, 2022 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీని ఈనెల 7న ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నాయకులు కలవనున్నారు. ఇటీవల ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు మోదీ వచ్చిన సందర్భంగా ఆయన్ను కలిసే అవకాశం లభించిన వారిని కలిపించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మోదీ పర్యటన రోజే కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి వారికి మాటనిచ్చారు.

ప్రధానిని కలుసుకునే వారిలో 47 మంది జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, కొందరు పార్టీ రాష్ట్ర పదాధికారులు, పార్టీ హైదరాబాద్‌ సెంట్రల్, భాగ్యనగర్‌ మహంకాళి, గోల్కొండ జిల్లాల అధ్యక్షులు, ఈ జిల్లాల పరిధిలోని పార్టీ ఆఫీస్‌ బేరర్లు, తదితరులున్నారు. వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు కూడా వీరితో పాటు మోదీని కలుసుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వచ్చేనెల 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ భేటీ నిర్వహించనున్న నేపథ్యంలో మోదీతో నగరానికి చెందిన ముఖ్యనేతలు, కార్పొరేటర్ల సమావేశం ద్వారా కొత్త ఉత్సాహం నెలకొంటుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.    

మరిన్ని వార్తలు