మీ తాత, జేజమ్మలు వచ్చినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదు: బండి సంజయ్‌

24 Aug, 2022 14:47 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: కుటుంబ పాలన ఎంత ప్రమాదమో కేసీఆర్‌ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతూ, పాదయాత్రను అడ్డుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా బండి సంజయ్‌ కరీంనగర్‌లో చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రజల దృష్టి మళ్లించడానికే నన్ను అరెస్టు చేశారు. ఇసుక బుక్కేది వాళ్ళే లిక్కర్ దందాలో వాళ్ళే డ్రగ్స్ భూ మాఫియా ఏదైనా వాళ్ళే. ఎక్కడ ఐటీ దాడులు జరిగినా వాళ్ల మూలాలు వాటాలే. 1400 మంది ఆత్మ బలిదానాల మంటల్లో సీఎం కేసీఆర్ చలి కాల్చుకుంటున్నారు. లిక్కర్ ఆరోపణలు డైవర్ట్ చేసేందుకు హైదరాబాద్‌లో మత విద్వేషాలు, మత ఘర్షణలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్లాన్ జరిగింది. ఎంఐఎంతో కలిసి హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ నిజం.

నా కుటుంబం జోలికి వస్తే పరిస్థితి ఇలా ఉంటుందని వార్నింగ్ వచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. మీ తాత జేజమ్మలు వచ్చినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదు. రాడ్‌లతో వచ్చినా రాళ్లతో వచ్చినా సరే యాత్ర చేసి తీరుతాం. 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరిపి తీరుతాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా ఆధ్వర్యంలో సభ జరుగుతుంది' అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

చదవండి: (అమిత్‌ షా వారిద్దర్నీ కలవడమే హాట్‌ టాపిక్‌!)

>
మరిన్ని వార్తలు