ఆషాఢ మాస బోనాలకు వేళాయె..

12 Jun, 2021 14:03 IST|Sakshi
గతేడాది మీరాలంమండిలో అమ్మవారి ఘటానికి స్వాగతం పలుకుతున్న గాజుల అంజయ్య

ఈసారి ఘనంగా బోనాల జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు

గతేడాది ఆంక్షల నడుమ నెల రోజులపాటు బోనాల జాతర

వచ్చే నెల 11 నుంచి గోల్కొండ అమ్మవారికి బోనంతో ప్రారంభం కానున్న ఉత్సవాలు

25న సికింద్రాబాద్‌ ఉజ్జయినీ అమ్మవారికి... 

ఆగస్టు 1న పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్పణ

2న పాతబస్తీలో ఘటాల సామూహిక ఊరేగింపు

ఈసారి కూడా సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమం

హైదరాబాద్‌: ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవాల నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది కోవిడ్‌–19 ఆంక్షల నడుమ బోనాల జాతర ఉత్సవాలు ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా జరిగాయి. అమ్మవారికి బోనాలను ఆయా దేవాలయాల్లో కాకుండా ఇళ్లల్లోనే నిర్వహించాలని ప్రభుత్వం సూచించడంతో నెల రోజుల పాటు బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించారు. భక్తులు లేకుండానే అమ్మవారికి ఆయా దేవాలయాల కమిటి ప్రతినిధులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఈసారి వైభవంగా ఉత్సవాలను నిర్వహించడానికి నిర్వాహకులు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే భాగ్యనగర్‌ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుని ఎన్నిక కూడా పూర్తి అయ్యింది. కమిటి ఆధ్వర్యంలో త్వరలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు దేవాదాయ శాఖ మంత్రి  ఇంద్రకరణ్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బోనాల జాతర ఉత్సవాలపై చర్చించడానికి సిద్ధమవుతున్నారు. 

గతేడాది నెల రోజుల పాటు బోనాల సమర్పణ... 
గతేడాది జూన్‌ 25 నుంచి జూలై 26 వరకు ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలు జరిగాయి. పాతబస్తీలో గతేడాది జూలై 19న, సంబందిత ఆలయాల ప్రతినిధులు, పండితుల మంత్రోచ్చరణలతో అమ్మవారికి పూజలు,బోనం సమర్పణ జరిగింది. మరుసటి రోజు అంటే..జూలై 20న, ఎలాంటి హడావిడి లేకుండా అమ్మవారి ఘటాల ఊరేగింపు కొనసాగింది.  పరిమిత సంఖ్యలో దేవాలయాలకు చెందిన భక్తులు తప్పా..సా«ధారణ ప్రజలెవరు ఈ సామూ హిక ఘటాల ఊరేగింపులో పాల్గొన లేదు. ఈసారి కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్యగణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలను ప్రభుత్వం ఆంక్షలను తొలగిస్తుందని ఉత్సవాల నిర్వాహకులు ఆశిస్తున్నారు. 

గతేడాదిలా కాకుండా ఈసారి అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అవకాశాలుంటాయని భావిస్తున్నారు. మాస్క్‌లు «ధరించడంతో పాటు... భౌతిక దూరం పాటిస్తూ ఆయా దేవాలయాలలో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించడానికి ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించకపోవచ్చని భావిస్తున్నారు. ఈసారి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు జూలై 11న, గోల్కొండ జగదాంబా అమ్మవారికి  సమర్పించే మొదటి బోనంతో నగరంలో ఉత్సవాలు ప్రాంభమవుతున్నాయి.  జూలై 25న సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమాలుంటాయి.  అదే రోజు పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ప్రాంభమవుతాయి.  

ఈ ఏడాది జాతర వివరాలివీ... 
ఆగస్టు 1న పాతబస్తీలో అమ్మవారికి భక్తులు బోనాల సమర్పన పూజా కార్యక్రమాలుంటాయి.  
ఆగస్టు 2న పాతబస్తీలో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కార్యక్రమాలుంటాయి.. 
వచ్చే నెల 25న సికింద్రబాద్‌ అమ్మవారి బోనాల జాతర రోజే పాతబస్తీలో కాశీవిశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు కొనసాగుతుంది. 
అనంతరం ఆయా దేవాలయాల్లో ఘటాల స్థపాన జరుగుతుంది. గతంలోలాగే ఈసారి కూడా సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమం నిర్వహించనున్నారు. 
సప్త మాతృకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర్‌ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబా అమ్మవారు,
బల్కంపేట ఎల్లమ్మ తల్లి, విజయవాడ కనక దుర్గమ్మ తల్లికి, సికింద్రాబాద్‌ ఉజ్జయి నీ మహంకాళీ అమ్మవారు, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తలి, చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ అమ్మవారు, లాల్‌దర్వాజా సింహవాహిని
అమ్మవారితో కలిపి ఏడు దేవాలయాల అమ్మవార్లకు ఏడు బంగారు బోనాలను సమర్పించనున్నారు. 
ఏడు దేవాలయాల అమ్మవార్లకు బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. 

ఈసారి ఘనంగా నిర్వహిస్తాం..
భాగ్యనగర్‌ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగి ంపు కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీలో ఈసారి బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విషయమై మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తోపాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కలువనున్నాం. వారి సలహాలు, సూచనల మేరకు ఆషాఢ మాస బోనాలలను గతేడాది కన్నా ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తాం. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆయా దేవాలయాలలో అమ్మ వారికి బోనాలు సమర్పించేలా తగిన ఏర్పాట్లు చేస్తాం.  – బల్వంత్‌ యాదవ్, భాగ్యనగర్‌ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఆలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు