Huzurabad: తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌

23 Jul, 2021 17:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) చైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండా శ్రీనివాస్ విద్యార్థి నాయకుడిగా అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా కూడా పని చేశారు. హాకీ ప్లేయర్‌ అయిన శ్రీనివాస్ హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా, ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

గతంలో హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్‌గా, జిల్లా టెలికాం బోర్డు సభ్యుడిగా బండా శ్రీనివాస్ పనిచేశారు. హుజూరాబాద్ నుంచి ఎంపీటీసీ సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీలో 2001లోనే చేరారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు స్వరాష్ట్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ మండలాధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రధాన అనుచరుడిగా శ్రీనివాస్‌ గుర్తింపు పొందారు.

మరిన్ని వార్తలు