దసరా మరుసటి రోజు సెలవు

23 Oct, 2020 19:21 IST|Sakshi

ఈనెల 29న ధరణి పోర్టల్ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌ : దసరా మరుసటి రోజు సెలవుగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి ఏడాది దసరా మరుసటి రోజు (అక్టోబర్‌ 26) సెలవుగా షెడ్యూల్ రూపొందించాలి అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌ పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం డీఏ ఎంత అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాన్ని అనుసరిస్తున్నాయి స్పష్టం చేశారు. కేంద్రం జాప్యం వల్ల డీఏ బకాయిలు పేరుకుపోతున్నాయి విమర్శించారు. ప్రతి 6 నెలలకు రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ నిర్ణయించాలని, కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే సవరించాలని అధికారులకు సూచించారు. కేబినెట్‌లో చర్చించి డీఏపై విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. 2019 జులై 1 నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలి.. డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

2020-21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష
2020-21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడిందని అన్నారు. కేంద్ర జీడీపీ కూడా మైనస్ 24 శాతానికి పడిపోయిన నేపథ్యంలో బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించి నివేదిక ఇవ్వాలని కోరారు. 

పలు నిర్ణయాలు..

  • తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 29న ధరణి పోర్టల్ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. 
  • తెలంగాణలో వరద సాయం చేసేందుకు ఉద్యోగులు ముందుకొచ్చారు. ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. వారి నిర్ణయంతో దాదాపు రూ.33కోట్ల విరాళం ప్రభుత్వానికి అందనుంది. 
     
  • వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని. క్వింటాలుకు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని, రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సీఎం కోరారు.
     
  • మక్కలకు దేశ వ్యాప్తంగా మార్కెట్ లేకపోవడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే వర్షాకాలంలో మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులను కోరింది.
     
  • రైతు సంక్షేమం - వ్యవసాయాభివృద్ధి కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రైతులను సంఘటిత శక్తిగా మలిచింది. రైతులను సమన్వయ పరిచి దేశంలోనే మొదటి సారిగా నిర్ణీత పంటల సాగు విధానం అమలు అవుతున్నది.
మరిన్ని వార్తలు