కొత్త మెడికల్‌ కాలేజీల ప్రారంభం.. తెలంగాణ చరిత్రలో కొత్త అధ్యాయం: సీఎం కేసీఆర్‌

15 Nov, 2022 12:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మారుమూల ప్రాంతాల్లో మెడికల్‌ కాలేజీలు వస్తాయని ఎవరూ ఊహించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌ వేదికగా తెలంగాణలో ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీలను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 

రాష్ట్ర చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయంగా పేర్కొన్నారు. కొత్త మెడికల్‌ కాలేజీలు తెచ్చేందుకు మంత్రి హరీష్‌రావు ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ఈ కాలేజీలతో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 2,790కి పెరిగిందని చెప్పారాయన. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మెడికల్‌ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయి. పీజీ సీట్లు కూడా 1,180కి చేరి.. రెట్టింపు అయ్యాయి. మొత్తంగా తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా మారుతోందని అన్నారు.

ఈ సందర్భంగా.. ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ క్లాసుల్ని వర్చువల్‌గానే ప్రారంభించారు సీఎం కేసీఆర్‌. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, రామగుండంలలో ఈ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. 

ఇదీ చదవండి: కేటీఆర్‌ అంకుల్‌.. కాలనీకి నల్లానీరు ఇప్పించరూ!

మరిన్ని వార్తలు