‘ప్రజాపంపిణీ’ పక్కదారి

24 Oct, 2021 02:19 IST|Sakshi
సీఎమ్మార్‌ ధాన్యాన్ని తమిళనాడుకు తరలిస్తూ పట్టుబడిన వాహనం

పొరుగు రాష్ట్రాలకు యథేచ్ఛగా సీఎమ్మార్‌ ధాన్యం తరలింపు 

గద్వాల నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడుకు.. 

‘పాలమూరు’లో ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో దందా 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రైస్‌మిల్లులు  సీఎమ్మార్‌ (కస్టం మిల్లింగ్‌ రైస్‌) చిల్లు పెడుతున్నాయి. మర ఆడించాల్సిన ధాన్యాన్ని తెరచాటుగా పక్కదారి పట్టిస్తు న్నాయి. పేదలకు అందాల్సిన బియ్యం పెద్ద ల పాలవుతున్నాయి. రాష్ట్ర సరిహద్దులు దా టి అక్రమార్కుల చెంతకు చేరుతున్నాయి. రాష్ట్రంలో దారి ద్య్రరేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలకు ప్రతినెలా ప్రభుత్వం రూపాయికి కిలోబియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సరఫరా చేస్తోంది. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొని, మర ఆడించి ఇచ్చేలా రైస్‌మిల్లులకు సీఎమ్మార్‌(కస్టం మిల్లింగ్‌ రైస్‌) కేటాయిస్తోంది. మర ఆడించినందుకుగాను మిల్లర్లకు చార్జీలు సైతం చెల్లిస్తోంది. అయితే ప్రజాపంపిణీ వ్యవస్థలో పందికొక్కులు చేరి సీఎమ్మార్‌ బియ్యాన్ని బొక్కేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరుకు చెందిన ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లో సీఎమ్మార్‌ ధాన్యం యథేచ్ఛగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలుతోంది. 

గద్వాల – కర్ణాటక – తమిళనాడు.. 
ఉమ్మడి పాలమూరు నుంచి సీఎమ్మార్‌ ధా న్యం ప్రధానంగా మూడు దశల్లో రాష్ట్ర సరి హద్దులు దాటుతోంది. గద్వాల నుంచి కర్ణా టకలోని రాయచూర్‌.. ఆ తర్వాత గంగావ తి జిల్లాలోని కాటుక టౌన్‌కు.. అక్కడి నుంచి తమిళనాడులోని గంగై పట్టణానికి త రలుతోంది. రాష్ట్రంలో ధాన్యానికి అధికంగా క్వింటాల్‌కు రూ.1,880 ధర పలుకుతుండగా, గంగైలో రూ.3 వేలకుపైగా పలుకుతోంది. క్వింటాల్‌కు అధికంగా రూ.1,000 నుంచి రూ.1,200 వరకు వస్తుండటంతో అక్రమార్కులు అక్కడికి దొంగచాటుగా తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం గద్వాల జిల్లాలో ఈ నెల 18న సీఎమ్మార్‌ ధాన్యాన్ని తరలిస్తూ పట్టుబడిన మూడు లారీలే.  

ఇవే నిదర్శనం..  
గతేడాది యాసంగిలో గద్వాల జిల్లాలో 1,27,476 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 29 రైస్‌ మిల్లులకు సీఎమ్మార్‌ కింద కేటా యించారు. సరిగ్గా మర ఆడిస్తే 85,489 మెట్రిక్‌ టన్నుల బియ్యం వస్తాయి. అయి తే ఇప్పటివరకు 23,170 మెట్రిక్‌ టన్నులను మాత్రమే మిల్లర్లు ప్రభుత్వానికి అ ప్పగించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడు వు ఈ నెలాఖరులోపు ఇంకా 62,319 మెట్రిక్‌ టన్నుల బి య్యాన్ని అప్పగించాలి. వారంలో ఇంతమొత్తం అప్పగించడం సాధ్యం కాదనేది సుస్పష్టం. అటు మిల్లుల్లో సీఎమ్మార్‌ కింద కేటాయించిన ధాన్యం నిల్వలు కనిపించడం లేదని సివిల్‌ సప్లయ్‌ వర్గాలే చెబుతున్నాయి. అంటే 70 శాతం మేర ధాన్యం తమిళనాడుకు తరలిపోయినట్లు తెలుస్తోంది.  

శ్రీ ఆంజనేయ రైస్‌ మిల్లుకు గత యాసంగికి సంబంధించి 2,883.320 మెట్రిక్‌ టన్నుల సీఎమ్మార్‌ ధాన్యం కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 421.900 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ప్రభుత్వానికి చేరింది. ఇంకా 1499.924 మెట్రిక్‌ టన్ను ల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈ నెల 18న ఈ మిల్లు నుంచి 1,399 బస్తాల ధాన్యాన్ని రెండు లారీల్లో తమిళనాడుకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతోపాటు వేరొకరికి చెందిన మరో లారీలో 600 బస్తాల ధాన్యం తరలుతుండగా అధికారులు మల్దకల్‌ వద్ద స్వాధీనం చేసుకున్నారు. గద్వాల స్టేషన్‌కు తరలించిన ఈ వాహనాలను తప్పించేందుకు ఓ ప్రజాప్రతినిధి తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. వీరిపై ఎట్టకేలకు ఐదు రోజుల తర్వాత 6ఏ కేసు నమోదు చేశారు. 

50 శాతం వాటా.. 
గత ఏడాది యాసంగిలో గద్వాల జిల్లా నుం చే కాకుండా నారాయణపేట, నాగర్‌కర్నూ ల్, వనపర్తి జిల్లాల నుంచి కూడా ధాన్యం సేకరించారు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యే రంగప్రవేశం చేసి సీఎమ్మార్‌ కింద మిల్లులకు కేటాయింపులు చేశారు. ఆ తర్వాత రేషన్‌ మాఫియాను తెర ముం దు ఉంచి తమిళనాడుకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ తతంగానికి ముందు రేషన్‌ దందా నిర్వహిస్తున్న ముఖ్యులతో ఆయన సమావేశమై 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు తెలిసింది.

మూడు లారీలు పట్టుబడిన క్రమంలో రేషన్‌ మాఫియాకు చెందిన ఓ లీడర్‌ ‘మాకేం మిగులుతాంది.. ఆయనకే సగం పోతాంది’అని తెలిసిన వారి వద్ద వాపోయినట్లు సమాచారం. నెలనెలా రేషన్‌ మాఫియా నుంచి ఆమ్యామ్యాలు అందుతుండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా.. లేక సదరు ప్రజాప్రతినిధి కంటపడితే బదిలీ కాక తప్పదని భయపడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..
రైస్‌ మిల్లులకు ప్రభుత్వం సీఎమ్మార్‌ ధాన్యాన్ని కేటాయించింది. ఈ క్రమంలో ఈ నెల 18న మూడు లారీలలో అక్రమంగా ధాన్యం తరలివెళ్తుండగా పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించాం. మూడు లారీలలో రెండు వేల బస్తాల ధాన్యం పట్టుబడింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై 6ఏ కేసు నమోదు చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఈ దందాలో పెద్దల పాత్రపై తమకు ఎలాంటి సమాచారం లేదు. అక్రమాలకు పాల్పడితే ఎవరినీ సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. 
– రఘురామ్‌శర్మ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల  

మరిన్ని వార్తలు