-

‘డ్వాక్రా ఉత్పత్తులకు కామన్‌ బ్రాండింగ్‌’ 

22 Feb, 2023 03:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా తయారు చేస్తున్న నిత్యావసర, ఇతర వస్తువులకు ఇంకా ఆకర్షణీయంగా లేబిలింగ్, ప్యాకింగ్‌తోపాటు మంచి కామన్‌ బ్రాండింగ్‌ ఏర్పాటు చేయాలి. దీనికి తెలంగాణ ముద్ర ఉండేటట్టు చూడాలి. అప్పుడు ఈ వస్తువులకు డిమాండ్‌ మరింత పెరుగుతుంది’అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

ఈ మేరకు మంగళవారం పీఆర్‌ శాఖ ముఖ్యకార్యదర్శి, సెర్ప్‌ సీఈవో సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ సంస్థతో ఒప్పందం కుదిరిందని, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ వంటి సంస్థలతోనూ మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకొని మహిళా ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యాలు విస్తృతం చేయాలన్నారు.

సీఎం కేసీఆర్‌ కృషి ఫలితంగా అభివృద్ధి, సంక్షేమంలో మనకు సాటి లేదని, మహిళాసంఘాల అభివృద్ధి, పొదుపు రుణాల్లో దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉంది. ఈ దశలో రాష్ట్రం పేరుప్రతిష్టలు ఇనుమడించేలా, మహిళా ఉత్పత్తులను సులువుగా, ఆకర్షణీయంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్ముడుపోయేలా ఈజీగా, క్యాచీగా ఉండేట్లుగా బ్రాండింగ్‌ రూపొందించాలని మంత్రి సూచించారు. త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి, వారి అనుమతితో కొత్త బ్రాండింగ్‌ చేయాలని, అందుకు తగ్గట్లుగా పలు పేర్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు