Congress Party: వరంగల్‌ సభకు అంతా సిద్ధం.. 

6 May, 2022 02:02 IST|Sakshi
కాంగ్రెస్‌ వరంగల్‌ బహిరంగ సభకు ముస్తాబైన సభా వేదిక

వరంగల్‌ వేదికగా రాహుల్‌ గాంధీ బహిరంగ సభ

రుణమాఫీ, పంట ఉత్పత్తులకు మద్దతు ధరపై ప్రకటనలు చేసే అవకాశం

పలు రైతు కుటుంబాలకు పరామర్శ..

రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటన

సభకు ఏర్పాట్లు పూర్తి చేసిన టీపీసీసీ.. 

ఐదు లక్షల మంది జనసమీకరణ లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షిప్రతినిధి, వరంగల్‌: పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా ‘రైతు డిక్లరేషన్‌’ప్రకటనకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం హను మకొండలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ‘రైతు సంఘర్షణ సభ’కు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ హాజరు కానున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రై తులకు ఏం చేస్తామనేది ఈ బహిరంగ సభ లోనే ప్రకటించనున్నారు.

గాంధీ భవన్‌ వర్గాల సమాచారం ప్రకారం.. వ్యవసాయ ఉత్పత్తులు, రుణమాఫీ, మద్దతుధర తదిత రాలపై రాహుల్‌ కీలక ప్రకటనలు, హామీలు ఇవ్వనున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతున్న ఇబ్బందులను ఎత్తి చూపడంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ భవిష్యత్‌ రాజకీయాలకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు అటు వరంగల్‌ సభతోపాటు శనివారం ఆయన హైదరాబాద్‌లో పర్యటించే చోట్ల టీపీసీసీ ఏర్పాట్లను పూర్తి చేసింది. 

వరంగల్‌ సభకు అంతా సిద్ధం.. 
రాహుల్‌ సభ నేపథ్యంలో ఏఐసీసీ, టీపీసీసీ నాయకులు, ఇన్‌చార్జులు హనుమకొండలో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగ రమంతా భారీ కటౌట్లు, పార్టీ జెండాలతో అలంకరించారు. సభకు ఐదు లక్షల మంది ని సమీకరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. సభ ప్రాంగణంలో మూడు భారీ వేదికలను ఏర్పాటు చేశారు. రాహుల్‌ ప్రసంగించే ప్రధాన వేదికతోపాటు రైతులు, కళాకారుల కోసం మరో రెండు వేదికలను వేర్వేరుగా సిద్ధం చేశారు.

ప్రత్యేక వేదికపై రైతులతో మాట్లాడిన తర్వాత సుమారు 7 గంటలకు రాహుల్‌గాంధీ ప్రసంగిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక రాహుల్‌ భద్రత కోసం.. సభావేదిక, ఇతర ఏర్పాట్లలో ఎస్‌పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు), ఎన్‌ఎస్‌జీ (నేషనల్‌ సెక్యూరిటీ గ్రూపు) సూచనల మేరకు పకడ్బందీ చర్యలు చేపట్టారు.  

సాగుతున్న రగడ.. 
రాహుల్‌గాంధీ ఓయూ పర్యటనకు అనుమతించాలన్న అంశంపై గురువారం కూడా రగడ కొనసాగింది. ఓయూ జేఏసీ నాయకులు విడతల వారీగా ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వీసీ రవీందర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడంటూ.. ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీసీ దిష్టి బొమ్మను దహనం చేశారు. 

రాహుల్‌ పర్యటన వివరాలివీ.. 6న షెడ్యూల్‌ ఇదీ.. 
►శుక్రవారం సాయంత్రం 4:50కి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
►5:10 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయలుదేరుతారు. 
►5:45 గంటలకు వరంగల్‌లోని సెయింట్‌ గాబ్రియెల్‌ స్కూల్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. 
►6:05 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. 
►రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయల్దేరుతారు. రాత్రి 10:40 గంటలకు హైదరాబాద్‌ చేరుకుని.. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో బస చేస్తారు. 

7న షెడ్యూల్‌ ఇదీ.. 
►శనివారం ఉదయం తాజ్‌కృష్ణ హోటల్‌లో పలువురు ప్రముఖులు, మీడియా పెద్దలతో రాహుల్‌ సమావేశమవుతారు. 
►మధ్యాహ్నం 12:30 గంటలకు సంజీవయ్య పార్కుకు బయలుదేరుతారు.  
►12:50 నుంచి 1:10 గంటల వరకు పార్కులోని విగ్రహం వద్ద మాజీ సీఎం దామోదరం సంజీవయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పిస్తారు. 
►1:30 గంటలకు గాంధీభవన్‌కు చేరుకుంటారు. టీపీసీసీ నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలో తీసుకువచ్చేందుకు అమలు చేయాల్సిన కార్యాచరణపై మాట్లాడుతారు.  
►2:50 నుంచి 3:50 గంటల వరకు.. అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సభ్య త్వ నమోదు చేసిన కోఆర్డినేటర్లతో భేటీ అవుతారు. వారితో ఫొటోలు దిగుతారు. 
►సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి బయలుదేరుతారు.  
►5:40 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో ఢిల్లీకి వెళతారు. 

మరిన్ని వార్తలు