సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య 1000కి పైన నమోదైంది. ఆరు నెలల తర్వాత వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం విశేషం. గడిచిన 24 గంటల్లో 44,202 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,054 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
అత్యధికంగా హైదరాబాదులో 396 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 60, నల్గొండ జిల్లాలో 49, కరీంనగర్ జిల్లాలో 46 కేసులు గుర్తించారు. విశేషం ఏంటంటే.. ఇంకా 630 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.
అదే సమయంలో 795 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. అయితే కేసులు కిందటి రోజు గణాంకాలతో పోలిస్తే.. మూడు వందలకు పైగా పెరిగాయి.(771 కేసులు)
అధికార గణాంకాల ప్రకారం.. తెలంగాణలో ఇప్పటివరకు 8,21,671 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,11,568 మంది కోలుకున్నారు. ఇంకా 5,992 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.