తెలంగాణ కోర్టుల్లో కరోనా కలకలం

6 Apr, 2021 08:48 IST|Sakshi

కరోనా బారిన జడ్జిలు, న్యాయవాదులు 

భౌతిక విచారణ ఆపాలని హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌లో కలకలం రేపుతోంది.  రోజువారీ కేసుల సంఖ్య  లక్ష మార్క్‌ను దాటడంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా  తెలంగాణా జంట నగరాల పరిధిలోని నాంపల్లి క్రిమినల్‌ కోర్టులు, సిటీ సివిల్‌ కోర్టు, సిటీ స్మాల్‌కాజెస్‌ కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల పరిధిలో పలువురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. అలాగే పదుల సంఖ్యలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో విచారణలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తుకారాంజీ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది.

భౌతిక విచారణ నిలిపివేయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది జూన్‌లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నప్పటి ఆదేశాలను ఇప్పుడు అమలు చేయాలన్నారు. దీంతో జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోర్టుల్లో కేసులను భౌతికంగా విచారించరు. ముఖ్యమైన, తుది వాదనల సమయంలో ఉన్న 20 కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించే అవకాశముంది. ఆయా కేసుల్లో కక్షిదారులు హాజరుకాకపోయినా ప్రతికూలమైన ఆదేశాలు జారీచేయరాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేస్తారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో రోజూవారీగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, కోర్టు వీలును బట్టి కేసులను పరిష్కరించాలని స్పష్టంచేశారు. 

>
మరిన్ని వార్తలు