విద్యుత్‌ వాత.. అభ్యంతరాల మోత

4 Feb, 2022 02:00 IST|Sakshi

రికార్డు సంఖ్యలో అభ్యంతరాలు

జాబితాలో ఎంఈఐఎల్, టీసీఎస్, ఐటీసీ, పెన్నా,జువారి సిమెంట్‌ వంటి ప్రముఖ సంస్థలు

ఈఆర్సీ, డిస్కంలపై పెరిగిన ఒత్తిడి

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరం లో రూ.6,831 కోట్ల విద్యుత్‌ చార్జీల పెంపు నకు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమర్పించిన ప్రతిపాదనలపై బడా పారిశ్రా మికవేత్తలు, అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలు, టాప్‌ కంపెనీలతోపాటు సామాన్య వినియోగదా రులూ భగ్గుమన్నారు. వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉన్న ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కి రికార్డు సంఖ్యలో రాత పూర్వక అభ్యంత రాలు అందాయి.

గడువు ముగిసిన జనవరి 28 నాటికి దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)కు 191, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌)కు 92 అభ్యంతరాలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీ రింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈ ఐఎల్‌), ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్స ల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీ ఎస్‌), ఎల్‌అండ్‌టీ మె ట్రో రైలు, పెన్నా సిమెంట్స్, జువారి సిమెం ట్స్, ఫ్యాప్సీ తెలంగాణ, తెలంగాణ ఫెర్రో అలాయ్స్‌ ఉత్పత్తిదారుల సంఘం, ఐటీసీ లిమిటెడ్, ఇండియా ఎనర్జీ ఎక్సే్ఛంజీ లిమి టెడ్, మైత్రాహ్‌ ఎనర్జీ, డిస్ట్రిబ్యూటెడ్‌ సోలార్‌ పవర్‌ అసోసియేషన్, సౌత్‌ ఇండియా సిమెంట్స్‌ మ్యానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ వంటి ప్రముఖ వ్యాపార సంస్థలతోపాటు కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆయోధ్య రెడ్డి, విద్యుత్‌ రంగ విశ్లేషకులు తిమ్మారెడ్డి, ఎం.వేణు గోపాల్‌ రావు, ధోంతి నర్సింహా రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ఏపీసీపీడీసీఎల్‌ మాజీ డైరె క్టర్‌ సూర్య ప్రకాశ రావు, అఖిల భారత్‌ కిసాన్‌ మహాసభ నుంచి సారంపల్లి మల్లారెడ్డి అ భ్యంతరాలు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. 

బహిరంగ విచారణలో మళ్లీ..
భారీగా వచ్చిన అభ్యంతరాలన్నింటికీ రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వడం డిస్కంలకు ఇబ్బందికర విషయమే. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 18న సిరిసిల్లలో, 21న హన్మకొండలో, 23న వనపర్తిలో, 25న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు ఇప్పటికే ఈఆర్సీ ప్రకటించింది.

ఆ సమయంలో మళ్లీ పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చే అవకాశముంది. వీటికి డిస్కంల సీఎండీలు అప్పటికప్పుడే మౌఖికంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఊహించని రీతిలో పెద్దసంఖ్యలో స్పందన వస్తుండటంతో చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మరిన్ని వార్తలు