ఈ నెలాఖరున ఎంసెట్‌ నోటిఫికేషన్‌!

18 Feb, 2021 01:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఈ నెలాఖరున జారీ చేసేందుకు ఎంసెట్‌ కమిటీ కసరత్తు చేస్తోంది. జూలై 5 నుంచి 9 వరకు నిర్వహించే ఈ పరీక్షల్లో సాధారణంగా ముందు మూడ్రోజుల పాటు (5, 6, 7 తేదీల్లో) ఆన్‌లైన్‌లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను 6 సెషన్లలో (రోజుకు 2 సెషన్లు) నిర్వహిస్తారు. అవసరమైతే 8వ తేదీన కూడా ఒక సెషన్‌ నిర్వహించే అవకాశముంటుంది. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ఎంసెట్‌ను 8, 9 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. అయితే ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు(జూలై 3న), ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షల ప్రారంభ తేదీకి మధ్య ఒకరోజు గడువే ఉంటోంది. మరోవైపు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ పరీక్ష తేదీలు ఇంకా ఖరారు కాలేదు.

కాబట్టి నీట్‌ తేదీలపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్‌ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను ముందుగా నిర్వహించాలా? అన్న విషయంలో మరోసారి ఉన్నత విద్యామండలితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎంసెట్‌ కమిటీ భావిస్తోంది. ఇక, ఈసారి 160 ప్రశ్నలకు బదులు 180 ప్రశ్నలిస్తే విద్యార్థులకు 20 ప్రశ్నలు ఆప్షన్‌గా ఉండేలా కసరత్తు చేస్తోంది. వీటన్నింటిపై చేపట్టిన ప్రక్రియ ఈ నెలాఖరుకల్లా పూర్తయితే నెలాఖరున ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. లేదంటే వచ్చే నెల మొదటి వారంలో జారీ చేయనుంది.  

మరిన్ని వార్తలు