ఓల్డ్‌ సిటీకి పోటీగా గజ్వేల్‌, సిద్దిపేట.. ఏ విషయంలో అంటే?

31 Dec, 2021 03:43 IST|Sakshi

విద్యుత్‌ నష్టాల్లో టాప్‌లో చార్మినార్, గజ్వేల్, ఆస్మాన్‌గఢ్, సిద్దిపేట డివిజన్లు 

చార్మినార్, గజ్వేల్, ఆస్మాన్‌గఢ్‌లో 35%, సిద్దిపేటలో 32 శాతం 

ఏటీఅండ్‌సీ నష్టాలు తొలి త్రైమాసిక ఎనర్జీ 

ఆడిట్‌లో బహిర్గతం 

విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా ఆడిట్‌ నిర్వహణకు శ్రీకారం

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ చౌర్యం, బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థత వెరసి విద్యుత్‌ శాఖను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి. పలు డివిజన్లలో ఇలాంటి కారణాలతో సంస్థకు కోట్ల రూపాయలు లోటు వస్తోంది. వీటిలో ఇప్పటిదాకా ఓల్డ్‌ సిటీ ముందుండగా.. దీనికి పోటీగా గజ్వేల్, సిద్ది పేట కూడా ఉండటం గమనార్హం. దక్షిణ తెలంగాణ లోని 5 ఉమ్మడి జిల్లాల పరి ధిలో అత్యధిక విద్యుత్‌ నష్టాలు చార్మినార్, గజ్వేల్, ఆస్మాన్‌గఢ్, సిద్దిపేట డివిజన్లలో నమోదయ్యాయి.

చార్మినార్‌ డివిజన్‌లో 35.73%, గజ్వేల్‌లో 35.5%, ఆస్మాన్‌గఢ్‌లో 35. 01%, సిద్దిపేటలో 32.31% సాంకేతిక, వాణిజ్య (ఏటీఅండ్‌సీ లాసెస్‌) నష్టాలు జరిగినట్టు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) నిర్వ హించిన తొలి త్రైమాసిక ఎనర్జీ ఆడిట్‌లో బహిర్గత మైంది. కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్‌ సం స్కరణల అమల్లో భాగంగా సంస్థ ఎనర్జీ ఆడిట్‌కు శ్రీకారం చుట్టింది. 2021 జూలై 1–సెప్టెంబర్‌ 30 మధ్య కాలానికి సంబంధించిన ఎనర్జీ ఆడిట్‌ నిర్వహించి గురువారం నివేదికను ప్రకటించింది. ఈ 3 నెలల్లో సంస్థ ఏటీఅండ్‌సీ నష్టాలు 10.63% ఉండ డం గమనార్హం. సాంకేతిక లోపాలతో జరిగే విద్యు త్‌ నష్టాలు, విద్యుత్‌ చౌర్యం, బిల్లింగ్‌ లోపాలతో జరిగే నష్టాలు, విద్యుత్‌ బిల్లుల మొండిబకాయిలు, వసూళ్లలో అసమర్థతతో జరిగే నష్టాల మొత్తాన్ని సాంకేతిక పరిభాషలో ‘అగ్రిగేట్‌ టెక్నికల్‌ అండ్‌ కమర్షియల్‌ (ఏటీఅండ్‌సీ) లాసెస్‌’అంటారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 20 సర్కిళ్లు, 50 డివిజన్లు, 1,01,32,163 మంది వినియోగదారులు ఉన్నారు.  

అధిక ఏటీఅండ్‌ సీ నష్టాలు ఇక్కడే... 
► చార్మినార్‌ డివిజన్‌కు 198.78 మిలియన్‌ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ సరఫరా చేయగా, వినియోగదారుల మీటర్ల నుంచి తీసిన లెక్కల ప్రకా రం 122.7ఎంయూల అమ్మకాలే జరిగాయి. ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌ నష్టాల రూపంలో 76.04(38%) ఎంయూల విద్యుత్‌ నష్టమైంది. అయితే, ఈ జోన్‌ పరిధిలో మీటర్డ్‌ సేల్స్‌కి జారీ చేసిన బిల్లులకు 104% వసూళ్లు జరిగాయి. గృహాల నుంచి 107.47% కలెక్షన్‌ ఉంది.  
►  గజ్వేల్‌ డివిజన్‌కు 399.44 ఎంయూల విద్యుత్‌ సరఫరా కాగా, 201.9 ఎంయూలు మీటర్డ్‌ సేల్స్, 171.72 ఎంయూలు అన్‌మీటర్డ్‌ సేల్స్‌(మీటర్‌ లేని వ్యవసాయ పంప్‌ సెట్లకు) జరిగా యి. సాంకేతికంగా 25.7 శాతం నష్టాలు నమోద య్యాయి. మొండిబకాయిలతో ఏటీఅండ్‌సీ నష్టాలు 35.5 శాతానికి పెరిగాయి. గృహాలు 102.19%, రైతులు 64.54%, ఎల్టీ కమర్షియల్‌/ ఇండస్ట్రీలు 105.68%, హెచ్‌టీ కమర్షియల్‌/ఇండస్ట్రీలు 90.27% బిల్లులు చెల్లించగా, ఇతరులు మాత్రం 38.01 శాతమే బిల్లులు చెల్లించారు.  
►  దక్షిణ హైదరాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని ఆస్మాన్‌గఢ్‌ డివిజన్‌కు 176.5 ఎంయూల విద్యుత్‌ సరఫరా చేయగా, 107.26 ఎంయూలకే బిల్లింగ్‌ జరిగింది. అంటే 69.55 ఎంయూ (39%)ల విద్యుత్‌ నష్టపోయింది. ఏటీఅండ్‌సీ నష్టాలు 35.01% ఉన్నాయి.  
►   బేగంబజార్‌ డివిజన్‌కు 120.95 ఎంయూల విద్యుత్‌ సరఫరా చేయగా, 42.05 (35శాతం) ఎంయూల నష్టం వాటిల్లింది. 78.91 ఎంయూలకు మాత్రమే బిల్లింగ్‌ జరిగింది. ఈ డివిజన్‌ పరిధిలో ఏటీఅండ్‌సీ నష్టాలు 34.01శాతం.  
►  సిద్దిపేట డివిజన్‌కు 341.27 ఎంయూలను సరఫరా చేస్తే మీటర్డ్‌ రీడింగ్‌ ద్వారా 158.4, అన్‌మీటర్డ్‌గా 157.55 ఎంయూలు కలిపి మొత్తం 316 ఎంయూలకు బిల్లింగ్‌ జరిగింది. 25.12 (7శాతం) ఎంయూలు నష్టపోయాయి. మొండి బకాయిల వల్ల 32.31 శాతం ఏటీఅండ్‌సీ నష్టాలున్నాయి.   


   

మరిన్ని వార్తలు