తెలంగాణలో ఉద్యోగాల జాతర.. 614 పోస్టులకు మరో జాబ్‌ నోటిఫికేషన్‌

29 Apr, 2022 11:16 IST|Sakshi

అబ్కారీ, రవాణా కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

ఆర్టీఏలో 63, ఎక్సైజ్‌లో 614 పోస్టులు

మే 2 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటికే 16,614 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు.. గురువారం ట్రాన్స్‌పోర్ట్, అబ్కారీ శాఖల్లోని కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలోని 63 కానిస్టేబుల్‌ పోస్టులు, ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (అబ్కారీ)లో 614 కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిసింది. ఇందుకోసం మే 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. రవాణా శాఖలో హెడ్‌ ఆఫీస్‌లో 6 కానిస్టేబుల్‌ పోస్టులు, లోకల్‌ కేడర్‌ కేటగిరీలో 57 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపింది.

ఇంటర్మీ డియెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అబ్కారీ కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, రవాణా శాఖ పోస్టులకైతే ఇంటర్‌తో పాటు లైట్‌ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు అధికారులు వెల్లడించారు.  ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు రుసుముగా చెల్లించాలని సూచించారు. నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన నోటిఫికేషన్‌లోని పోస్టులు, కేటగిరీలకు ఏయే రిజర్వేషన్లు ఉన్నాయో అవే రిజర్వేషన్లు ఆయా కేటగిరీల అభ్యర్థులకు వర్తిస్తాయని బోర్డు స్పష్టం చేసింది. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే విధంగానే ముందుగా ప్రిలిమినరీ రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షలు, చివరగా తుది రాత పరీక్ష ఉంటుందని తెలిపింది. 

మొదటిసారిగా బోర్డు..
అబ్కారీ, ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ గతంలో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించేది. అయితే మొదటిసారిగా యూనిఫాం పోస్టులకు సంబంధించిన పూర్తి నియామక ప్రక్రియను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు ప్రభుత్వం అప్పగించింది. అన్ని పోస్టులకు విద్యార్హతలతో పాటు నియామక ప్రక్రియ దాదాపుగా ఒకే విధంగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు