రూ.1,500 కోట్ల కేటాయించినా..రైతన్నకు పనిముట్లు అందలే

30 Jun, 2021 00:53 IST|Sakshi

సీజన్‌ మొదలైనా రైతులకు అందని వ్యవసాయ యంత్రాలు

వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత 

5 వేల వరి నాటు యంత్రాలు, ఇతర పనిముట్ల పంపిణీ లక్ష్యం 

వానాకాలంలో 30 లక్షల ఎకరాల్లో సాగుకు సిద్ధమైన రైతాంగం

ఇప్పటికీ మార్గదర్శకాలు ఖరారు చేయని వ్యవసాయ శాఖ

ఊపందుకోని రైతు చైతన్య యాత్రలు.. రైతు వేదికల ప్రారంభం

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ఒకరకంగా వ్యవసాయ యాంత్రీకరణ విప్లవం వచ్చింది. తెలంగాణ ఏర్పడక ముందు నాటి పరిస్థితితో పోల్చుకుంటే, రైతులకు యంత్రాల పంపిణీ దాదాపు రెండింతలైంది. ఈ ఏడాది రూ.10 లక్షల వరకు విలువ చేసే వరి నాటు యంత్రాలను సైతం సబ్సిడీపై అందజేయాలనే ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 1,500 కోట్లు కేటాయించింది. సీజన్‌ ప్రారంభంలోనే రైతులకు యంత్రాలు చేతికి అందితే  సాగుకు బాగా మేలు జరిగేది. కానీ ఇప్పటివరకు పనిముట్ల పంపిణీకి మార్గదర్శకాలే ఖరారు కాలేదు. 

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. రైతులకు అవసరమైన ట్రాక్టర్లు, కోత, నూర్పిడి యంత్రాలు, పవర్‌ టిల్లర్లు వంటి భారీ యంత్రాలతో పాటు స్ప్రేయర్ల వంటి వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇచ్చేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1,500 కోట్లను ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించింది. కానీ ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా రైతులకు లబ్ధి చేకూర్చడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వానాకాలం సీజన్‌ మొదలుకావడం, పెరిగిన నీటి వనరుల లభ్యత, పెట్టుబడి సాయం (రైతుబంధు) సైతం అందిన నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో సర్కారు లక్ష్యం మేరకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందితే వారికి మరింత ఊతం లభించినట్టయ్యేది. కానీ వ్యవసాయ శాఖ ఈ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడంతో, కనీసం తైవాన్‌ స్ప్రేయర్‌ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రల నిర్వహణలో, రైతులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో నిర్మించిన రైతు వేదికల ప్రారంభంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. 

ఆధునికత సంతరించుకున్న సాగు
వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వ్యవసాయ యాంత్రీకరణకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. 2018 వరకు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో సహా పలు రకాల యంత్రాలను సబ్సిడీపై రైతులకు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో పంటల ఉత్పత్తి, ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది.

కంపెనీలు సిద్ధంగా ఉన్నా..
గతంలో ట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో ఇచ్చినందున ఈ ఏడాది ప్రధానంగా వరినాట్లు పెట్టే యంత్రాలను సబ్సిడీపై ఇచ్చి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం భావించింది. ఒక్కో వరి నాటు యంత్రం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉండే నేపథ్యంలో మండలానికి 10 యంత్రాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే ఇతర యంత్రాలు అందజేసేందుకు పలు కంపెనీలతో మాట్లాడింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన 5 వేలకు పైగా వరినాటు యంత్రాలను ఆయా కంపెనీలు కూడా సిద్ధం చేసి ఉంచాయి. వీటితో పాటు ఇతర యంత్రాల కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపి, నిధులు మంజూరు చేయించుకుని, రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమయ్యింది. 

ఇప్పటికే ఆలస్యం
వ్యవసాయ సీజన్‌ ప్రారంభానికి ముందే వ్యవసాయ యంత్రాలను రైతులకు సరఫరా చేయాలి. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వరినాట్ల యంత్రాలను సరఫరా చేయాలంటే పెద్ద తతంగమే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నా అర్హులను తేల్చి పంపిణీ చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని గతంలో ట్రాక్టర్ల పంపిణీ అనుభవాలు చెబుతున్నాయి. ఇప్పుడు వరినాట్ల యంత్రాల పంపిణీ కూడా పారదర్శక విధానంలో చేపట్టాలంటే ఖచ్చితంగా సమయం తీసుకుంటుందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వంరూ.1,500 కోట్ల బడ్జెట్‌ కేటాయించినా సద్వినియోగం కాని తీరుపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

 రైతు చైతన్య యాత్రలేవీ?
వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడలు, అధునాతన సాంకేతికత వినియోగంపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రలు గత మూడేళ్లుగా జరగడం లేదు. ఏటా వానాకాలం సీజన్‌ ప్రారంభానికి ముందు వేసవిలో 15 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఈ యాత్రలు నిర్వహించేవారు. ప్రస్తుతం అవి జరగకపోవడంతో పంటల సాగులో వస్తున్న మార్పులపై అవగాహన లేకుండా పోతోందని రైతు సంఘాలు చెబుతున్నాయి. అధికారులు మాత్రం రైతుబంధు, రైతు బీమా పథకాల అమల్లో నిమగ్నం అవ్వడం వల్లే ఈ యాత్రలు నిర్వహించలేకపోతున్నామని పేర్కొంటున్నారు.

ప్రారంభం కాని రైతు వేదికలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు చాలాచోట్ల ప్రారంభం కాకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. రైతులంతా ఒకచోట సమావేశమై సాగు సమస్యలు చర్చించుకునేందుకు, రైతులకు అవసరమైన శిక్షణ ప్రధాన లక్ష్యంగా రైతు వేదికలు నిర్మించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,601 వేదికలను నిర్మించినా చాలాచోట్ల ఇవి ప్రారంభానికి నోచుకోలేదు. ఆదిలాబాద్‌ జిల్లాలో 101 రైతు వేదికలు నిర్మించారు. అయితే పంచాయతీరాజ్‌ శాఖ ఇంకా ఆ భవనాలను వ్యవసాయ శాఖకు అప్పగించకపోవడంతో అవి ప్రారంభం కాలేదు. ఆసిఫాబాద్‌లో 70కి గాను 46 నిర్మాణాలు పూర్తికాగా, ఇందులో 13 ప్రారంభించలేదు. నిజామాబాద్‌ జిల్లాలో 103 వేదికలు నిర్మిస్తే 54, పాలమూరులో 88కి 25 ప్రారంభించారు. నారాయణపేట జిల్లాలో 77 రైతు వేదికలు నిర్మిస్తే కేవలం మూడు మాత్రమే ప్రారంభం కావడం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపాన్ని స్పష్టం చేస్తోంది. 

సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో సర్కారు లక్ష్యం మేరకు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు అందితే వారికి మరింత ఊతం లభించినట్టయ్యేది. కానీ వ్యవసాయ శాఖ ఈ దిశగా అడుగులు ముందుకు వేయకపోవడంతో, కనీసం తైవాన్‌ స్ప్రేయర్‌ వంటివి కూడా రైతులకు సబ్సిడీపై దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు రైతుల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించాల్సిన రైతు చైతన్య యాత్రల నిర్వహణలో, రైతులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో నిర్మించిన రైతు వేదికల ప్రారంభంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. 

ఆధునికత సంతరించుకున్న సాగు
వాస్తవానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వ్యవసాయ యాంత్రీకరణకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. గతంలో కూలీల కొరత సమస్యను అధిగమించడంతో పాటు ఉత్పత్తి పెంపునకు దోహదపడుతుందనే  ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు సహా పలు రకాల యంత్రాలను సబ్సిడీపై రైతులకు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు ట్రాక్టర్లు సహా కొన్నింటిపై 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో సరఫరా చేసింది. దాదాపు 8 వేల వరకు ట్రాక్టర్లను వ్యవసాయశాఖ రైతులకు సబ్సిడీపై అందజేసింది. దీంతో రాష్ట్రంలో వ్యవసాయం ఆధునికత సంతరించుకుంది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులతో కొత్త ఆయకట్టు పెరగడం, మరోవైపు యాంత్రీకరణ జరగడంతో ప్రభుత్వం ఆశించినట్లుగానే పంటల ఉత్పత్తి, ఉత్పాదకత గణనీయంగా పెరిగింది.

మరిన్ని వార్తలు