నిధుల ‘పంచాయితీ’.. బిల్లులు పెండింగ్‌తో సర్పంచ్‌ల గగ్గోలు..

22 Dec, 2022 08:04 IST|Sakshi
కొన్ని రోజుల క్రితం ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం కామాగిరి సర్పంచ్‌  భీమ్‌రావు గ్రామ ప్రగతికి నిధులు సరిపోకపోవడంతో రూ.10 లక్షలు అప్పు చేసి వివిధ అభివృద్ధి పనులు చేశారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో వడ్డీలు కట్టేందుకు, కుటుంబ పోషణకు కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల నల్లగొండ జిల్లా మునుగోడు మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ సిబ్బందితో కలిసి భిక్షమెత్తారు. సర్పంచ్‌ నయ్యా ‘దానం చేయండి’అంటూ బ్యానర్‌ పట్టుకుని, డప్పు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు.  

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని పడగల్‌ వడ్డెర కాలనీ సర్పంచ్‌ ముత్తెమ్మ భర్త మల్లేష్‌ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు చేశాడు. బిల్లులు రాకపోవడంతో, తెచ్చిన అప్పులు కట్టలేక ఈ మధ్యనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌ / నెట్‌వర్క్‌:  రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సర్పంచ్‌ల పరిస్థితి అటు చెంపదెబ్బ, ఇటు గోడ దెబ్బ అన్నట్టుగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఆర్థిక సంఘాల నిధులు రూ.వందల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల్లేకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. సిబ్బంది వేతనాలు, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా మారుతోంది. కొన్నిచోట్ల రక్షిత మంచినీటి సరఫరా చేసే విద్యుత్‌ మోటార్లు పాడైతే మరమ్మతు చేసే పరిస్థితి కూడా లేదు. మరికొన్ని చోట్ల లక్షల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్‌లు.. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో వడ్డీలు కట్టలేక, కుటుంబ పోషణ కూడా భారమై దినసరి కూలీలుగా మారుతున్నారు.  

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా.. 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 1,692 గ్రామ పంచాయతీలున్నాయి. ఎస్‌ఎఫ్‌సీ నుంచి రూ.89.63 కోట్ల నిధులు రావాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.45 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.  

ఉమ్మడి ఖమ్మం జిల్లా.. 
ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో 589 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్రం, రాష్ట్రం నుంచి నెలకు రూ.13 కోట్లు వస్తున్నాయి. ఏప్రిల్‌ నుంచి కేంద్రం నిధులు, గత రెండు నెలలుగా రాష్ట్ర నిధులు రాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 పంచాయతీలున్నాయి. ప్రతినెలా విడుదలయ్యే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10.30 కోట్లు రావాలి. కానీ ఈ మార్చి నుంచి నిధులు రాలేదు. ఇక చేపట్టిన పనులకు సర్పంచులకు ఏడాదిన్నరగా బిల్లులు రాలేదు. చిన్న జీపీలకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా, పెద్ద జీపీలకు రూ.12 నుంచి రూ.18 లక్షల దాకా పెండింగులో ఉన్నాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా.. 
మొత్తం జీపీలు 1,507. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో కేంద్ర, రాష్ట్రాల నుంచి రూ.203.39 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా బేల మండల సర్పంచ్‌లు నిధుల విడుదలలో జాప్యానికి నిరసనగా ధర్నాకు దిగారు.  

సూర్యాపేట జిల్లా.. 
సూర్యాపేట జిల్లాలో 475 జీపీలున్నాయి. నెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.8.75 కోట్లు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ.8.25 కోట్లు రావాల్సి ఉంది. కానీ కొన్ని నెలలుగా నిధులు రావడం లేదు. అయితే ఇటీవలే ఎస్‌ఎఫ్‌సీ ఒక నెల నిధులు రూ.8.25 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా 15 ఆర్థిక సంఘం నిధులు రూ.70 కోట్లు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ. 24.75 కోట్లు పెండింగులో ఉన్నాయి.  

కేంద్ర, రాష్ట్ర నిధులు రూ.2 వేల కోట్లు పెండింగ్‌! 
నిధుల విడుదల, బిల్లుల చెల్లింపులో జాప్యానికి తాము కారణం కాదంటే తాము కారణం కాదని అంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాము ఇచి్చన డబ్బుల వల్లే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని చెప్పుకుంటున్నాయి. కేంద్రం 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇస్తున్న నిధులకు సమానంగా తాము కూడా రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) ద్వారా ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని రాష్ట్ర సర్కార్‌ చెబుతోంది.

అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆదాయం అంతగా లేని కొన్ని చిన్న పంచాయతీల్లో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (గత ఏప్రిల్‌ నుంచి) 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మరోవైపు పలు గ్రామ పంచాయతీలకు దాదాపు 3, 4 నెలలుగా రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ నిధులు ఆగిపోయాయి. కేంద్రం నుంచి వచి్చన నిధులకు సంబంధించిన వినియోగ సరి్టఫికెట్లు (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు (యూసీలు) రాష్ట్రం సమర్పించలేదని, అందుకే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి.

మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లో (జీపీలు) 7,100కు పైగా మైనర్‌ పంచాయతీలు, వాటిలో కొత్తగా ఏర్పాటైన జీపీలు 4,383 ఉన్నాయి. ఈ పంచాయతీల్లో ఐదారు వందల లోపు జనాభా ఉన్న పంచాయతీలే ఎక్కువగా ఉండగా, సొంత ఆదాయ వనరులు లేక ఈ పంచాయతీలన్నీ పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులపైనే ఆధారపడి ఉన్నాయి. కాగా 15వ ఆరి్ధకసంఘం నిధులు గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు రూ.1,000 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. అలాగే నాలుగు నెలల కాలానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక కమిషన్‌ నిధులు పంచాయతీలకు విడుదల కాలేదు. అవి కూడా దాదాపుగా అంతే మొత్తంలో ఉన్నట్టుగా సర్పంచ్‌లు చెబుతున్నారు.

ఇక జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు పెండింగ్‌ కూలి రూ.160 కోట్లతో పాటు, మెటీరియల్‌ కాంపోనెంట్‌ కూడా ఆరేడు వందల కోట్లు కేంద్రం నుంచి రాలేదు. వీటితో పాటు దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఉపాధి బకాయిల కోసం కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. అయితే నిబంధలను విరుద్ధంగా ఇతర పనులకు ఉపయోగించిన ఉపాధి హామీ పథకం నిధులు రూ.152 కోట్లు తమకు తిరిగి చెల్లించాలంటూ రాష్ట్రానికి కేంద్రం నోటీసులిచి్చంది. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్ల గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాల్లో ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించింది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నిధులతో పాటు పల్లెప్రగతి నిధులు కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో దాదాపు 80% దాకా చేసిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ఉమ్మడి కరీంనగర్‌లో సర్పంచ్‌ల సమస్యలపై ఇటీవల ధర్నాచేశాం.  
– ఉప్పల అంజనీప్రసాద్, రాష్ట్ర సర్పంచ్‌ల  సంఘం గౌరవ అధ్యక్షుడు, పంచాయతీరాజ్‌ చాంబర్‌ జనరల్‌ సెక్రటరీ 

రూ.4.50 లక్షల బిల్లులు రావాలి 
ఈ ఏడాది మా గ్రామంలో రూ.2.50 లక్షలతో సీసీ రోడ్డు, రూ.2.80 లక్షలతో డ్రైనేజీ నిర్మించాం. రూ.1.50 లక్షలతో లైట్లు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం పంచాయతీకి రూ.4.50 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. మలీ్టపర్పస్‌ వర్కర్ల వేతనాలు, విద్యుత్‌ బిల్లు, పారిశుధ్య పనుల నిర్వహణ కష్టంగా ఉంది. 
– కిష్ట్యానాయక్, పల్లెగడ్డతండా సర్పంచ్, నారాయణపేట జిల్లా 

ట్రాక్టర్‌ డీజిల్‌కూ అప్పు! 
నిధులు రాకపోవడంతో పంచాయతీ ట్రాక్టర్‌ రోజువారీ డీజిల్‌ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సి వస్తోంది. ఇక గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లుల జాడే లేదు. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి మరీ పనులు చేస్తే ఇదీ పరిస్థితి. 
– కాశీ విశ్వనాథ్, 4 ఇంక్లైన్‌ సర్పంచ్, భద్రాద్రి జిల్లా 

ప్రభుత్వం ఆదుకోవాలి.. 
8 నెలల క్రితం రూ.4 లక్షలు అప్పు తెచ్చి మురుగు కాల్వలను నిర్మించాం. ఇప్పటివరకు బిల్లులు రాలేదు. జీపీకి ప్రభు త్వం ఇచ్చే  నిధులు ట్రాక్టర్‌ కిస్తీకి, గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుల జీతాలకు కూడా సరిపోని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకోవాలి. నిధుల విడుదలపై దృష్టి సారించాలి. 
– తూముల శ్వేత, పెన్‌ పహాడ్‌ మండల కేంద్ర సర్పంచ్, సూర్యాపేట జిల్లా  

మరిన్ని వార్తలు