వాటి జోలికెళ్తే.. ఐదేళ్లు జైలుకే..!

24 Feb, 2023 04:08 IST|Sakshi

చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలు, ఫొటోల పోస్టింగ్, షేరింగ్‌తోపాటు చూడటమూ నేరమే 

దీనిపై ప్రపంచవ్యాప్తంగా నిషేధం.. వెబ్‌పై కన్నేసి ఉంచుతున్న ఎన్‌సీఎంఈసీ 

ఆధునిక సాఫ్ట్‌వేర్లతో నిందితులను గుర్తిస్తున్న బృందాలు 

ఎన్‌సీఆర్‌బీ సమన్వయంతో కేసులకు సిఫార్సులు 

కఠిన చర్యలు తీసుకుంటున్న స్థానిక సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

కోవిడ్‌ తర్వాతి పరిణామాల్లో భారీగా పెరిగిన పోర్నోగ్రఫీ కేసులు 

సాక్షి, హైదరాబాద్‌: చిన్నారులపై లైంగిక దాడులు జరగడానికి, పెరగడానికి దారితీస్తున్న చైల్డ్‌ పోర్నోగ్రఫీ జోలికి వెళ్తే జైలుకు వెళ్లడం ఖాయం. చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించి వీడియోలు, ఫొటోలను పోస్టు చేసినా, షేర్‌ చేసినా, చివరికి వీక్షించినా కూడా నేరమే. ఐదేళ్ల పాటు ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఇంటర్‌నెట్‌తోపాటు సోషల్‌ మీడియాలో చైల్డ్‌ పోర్నోగ్రఫీపై కన్నేసి ఉంచడానికి ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌ (ఎన్‌సీఎంఈసీ)’పనిచేస్తోంది.

పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి వీడియోలు, ఫొటోల (చైల్డ్‌ సెక్సువల్‌ అబ్యూజ్డ్‌ మెటీరియల్‌– సీఎస్‌ఏఎం)ను, వాటి గురించి సెర్చ్‌ చేస్తున్నవారు, వీక్షిస్తున్నవారిని కనిపెట్టడానికి అత్యాధునిక సాఫ్ట్‌వేర్స్‌ వినియోగిస్తోంది. వారు గుర్తించిన వివరాల ఆధారంగానే గత వారం హైదరాబాద్‌లో ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి. మైనర్లకు సంబంధించిన అసభ్య, అశ్లీల చిత్రాలన్నీ చైల్డ్‌ పోర్నోగ్రఫీ కిందికి వస్తాయి. వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, సాహిత్యం తదితరాలను సీఎస్‌ఏఎంగా పరిగణిస్తారు. 

ఎన్‌సీఎంఈసీ ఆధ్వర్యంలో.. 
అమెరికాకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ కాంగ్రెస్‌ 1984 జూన్‌ 13న ఎన్‌సీఎంఈసీ ఏర్పాటు చేసింది. వర్జీనియాలోని అలెగ్జాండ్రియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థ.. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించింది. చైల్డ్‌ పోర్నోగ్రఫీని ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన తర్వాత ఎన్‌సీఎంఈసీ చర్యలు ముమ్మరమయ్యాయి.

ఆన్‌లైన్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ వేగంగా పెరుగుతోందని ఎన్‌సీఎంఈసీ గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే ప్రతి 40 సెకన్లకు ఈ తరహా వీడియో ఒకటి క్యాప్చర్‌ అవుతోందని అంచనా వేసింది. జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం.. 2021లో భారత్‌ నుంచే 25 వేలకుపైగా చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్‌ అయ్యాయి. 

ఆధునిక టెక్నాలజీతో పటిష్ట నిఘా.. 
చైల్డ్‌ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గుర్తించడానికి ఎంసీఎంఈసీ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లు వాడుతూ ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కంటెంట్‌ను, సెర్చింగ్‌ను
గుర్తించడానికి కొన్ని కీవర్డ్స్‌ను రూపొందించింది. ఫలితంగా ప్రపంచంలో ఎవరైనా ఇంటర్‌నెట్‌లో, సోషల్‌ మీడియాలో చైల్డ్‌ పోర్నోగ్రఫీ కంటెంట్‌ గురించి సెర్చ్‌ చేసినా, వీక్షించినా, డౌన్‌లోడ్‌ చేసినా, అప్‌లోడ్‌ చేసినా.. వారు వినియోగించిన కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌/ఫోన్‌ల ఐపీ అడ్రస్‌లను సాఫ్ట్‌వేర్‌ గుర్తిస్తుంది.

ఈ వివరాలను ఎన్‌సీఎంఈసీ క్రోడీకరించి ఆయా దేశాలకు చెందిన నోడల్‌ ఏజెన్సీలకు అందిస్తుంది. మనదేశంలో జాతీయస్థాయిలో హోంశాఖ అధీనంలోని ఎన్‌సీఆర్‌బీ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. దీనికి అందిన వివరాలను రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలకు పంపిస్తుంది. రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులు ఈ వివరాలను సంబంధిత బాధ్యులు నివసించే ప్రాంత సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పంపిస్తారు. వారు కేసులు నమోదు చేసి, ఐపీ అడ్రస్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి.. అరెస్టు చేయడం/ నోటీసులివ్వడం వంటి చర్యలు చేపడతారు. 

స్మార్ట్‌ఫోన్లతో పెరిగి.. కోవిడ్‌తో విజృంభించి.. 
విస్తృతమైన ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి పోర్న్‌సైట్లను చూసే అవకాశం పెరగడంతో చాలా మంది బానిసగా మారుతున్నారు. కోవిడ్‌ లాక్‌డౌన్, ఆ తర్వాతి సమయంలో ఈ ధోరణి మరింత పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. చైల్డ్‌ పోర్నోగ్రఫీకి సంబంధించి దేశంలో 2018లో 44 కేసులు, 2019లో 103 కేసులు నమోదుకాగా.. 2020 నాటికి ఈ సంఖ్య 738కి, 2021లో 969కి పెరగడం గమనార్హం. జరుగుతున్న ఉదంతాల్లో కనీసం ఒక శాతం కూడా పోలీసు రికార్డుల్లోకి ఎక్కి కేసులుగా మారట్లేదని నిపుణులు పేర్కొంటున్నారు. 

విదేశాల్లో సర్వర్ల కారణంగా.. 
అశ్లీల వెబ్‌సైట్లపై ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటిని నిషేధించి బ్లాక్‌ చేయిస్తోంది. కానీ వాటి నిర్వాహకులు వెబ్‌సైట్‌ పేరులో స్వల్ప మార్పులు చేసి మరో వెబ్‌సైట్‌గా అందుబాటులోకి తెస్తున్నారు. వాటిపై ఫిర్యాదులు వచ్చి చర్యలు తీసుకునేవరకు ఇంటర్‌నెట్‌లో ఉంటున్నాయి. ఈ తరహా వెబ్‌సైట్లను హోస్ట్‌ చేస్తున్న సర్వర్లన్నీ విదేశాల్లో ఉన్నవే. వాటిపై ఫిర్యాదులు వచ్చినా నిర్వాహకుల వివరాలు తెలుసుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండటం లేదు.

బాగా చదువుకున్నవారూ నిందితుల్లో.. 
చైల్డ్‌ పోర్నోగ్రఫీ ఆరోపణలపై గత ఏడాది హైదరాబాద్‌లో 23 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో విద్యాధికులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉన్నారు. పోలీసులు నిందితులతోపాటు కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇక ఈ కేసుల్లో ఇటీవల నోటీసులు
అందుకున్న వారిలో వ్యాపారులు, చిరుద్యోగులు కూడా ఉన్నారు. 

అన్నిరకాలా నష్టం 
పోర్నోగ్రఫీకి బానిస అవుతున్నవారు అన్నిరకాలా నష్టపోతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ఇంటర్‌నెట్‌లో ఉండే పోర్న్‌ మెటీరియల్‌తో పాటే వైరస్‌లు ఉంటాయని.. ఆయా వెబ్‌సైట్ల ద్వారా వైరస్‌లను పంపే హ్యాకర్లు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను హ్యాక్‌ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటారని వివరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారం, నెట్‌ బ్యాంకింగ్, క్రెడిట్‌కార్డులు, ఇతర వివరాలూ హ్యాకర్లకు చేరి నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. 

నేరం నిరూపితమైతే ఐదేళ్ల జైలు 
చైల్డ్‌ పోర్నోగ్రఫీ అత్యంత హేయమైన నేరం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. దీనికోసం ఎవరు సెర్చ్‌ చేసినా, వీడియోలు, ఫొటోలను చూసినా నేరమే. దీన్ని బ్రౌజ్‌ చేసిన వారి సమాచారం ఎప్పటికప్పుడు మాకు అందుతుంది. వారిపై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌లోని 67–బీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేస్తాం. ఆధారాలతో కోర్టులో చార్జిషీట్‌ వేస్తాం.

కోర్టులో నేరం నిరూపితమైతే మొదటిసారి నేరం చేసిన వారికి గరిష్టంగా ఐదేళ్లు, రెండోసారి అయితే ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది. ఒకవేళ బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే.. పోక్సో యాక్ట్‌ కింద కూడా కేసులు నమోదవుతాయి. దోషిగా తేలితే జీవిత ఖైదు పడే ఆస్కారం ఉంది.

–గజరావ్‌ భూపాల్, సంయుక్త పోలీసు కమిషనర్, సీసీఎస్, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు