జెన్‌కోలో 250 ఏఈ పోస్టుల భర్తీ!

24 Jun, 2022 00:29 IST|Sakshi

జెన్‌కో సూత్రప్రాయ నిర్ణయం.. 

నెలరోజుల్లో నోటిఫికేషన్‌.. 

ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో నియామకాలు.. 150 ఎలక్ట్రికల్, 88 సివిల్‌ విభాగాల్లో ఏఈ పోస్టులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) నుంచి త్వరలో సుమారు 250 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రానుంది. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో ఏఈ పోస్టులను భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తికాకపోవడంతో పోస్టుల సంఖ్యపై స్పష్టత రాలేదు.

దాదాపు 150 ఏఈ(ఎలక్ట్రికల్‌), 88 ఏఈ (సివిల్‌) పోస్టులు ఉండనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. మిగిలిన పోస్టులు మెకానికల్, టెలికమ్యూనికేషన్‌ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ జారీకి కనీసం నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. జెన్‌కో స్వయంగా నోటిఫికేషన్‌ జారీ చేయనుండగా, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ జరగనుంది.

రాతపరీక్ష నిర్వహణ బాధ్యతను రాష్ట్రంలోని ఏదైనా యూనివర్సిటీకి అప్పగించనున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్వహణ అవసరాల కోసం ఏఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ కోసం ఇప్పుడు ఏఈలను భర్తీ చేయాలని భావిస్తే.. మరో 130 పోస్టులు పెరిగే అవకాశం ఉంది. త్వరలో నియామకాలపై జెన్‌కో యాజమాన్యం నిర్ణయం తీసుకోనుంది.  

మరిన్ని వార్తలు