తెలంగాణ: టపాసులు అమ్మటం, కాల్చటం నిషేధం

13 Nov, 2020 10:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో టపాసులపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని తెలిపారు. టపాసుల అమ్మకాలతో పాటు కాల్చడం కూడా నిషేధమన్నారు. క్రాకర్స్‌ షాపులను మూసివేయాలని ఆదేశించారు. 

కాగా, పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బాణసంచా కాల్చకుండా, విక్రయించ కుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19న వివరించాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు