తెలంగాణలో కోవిడ్‌ మృతులెందరు?

20 Jan, 2022 05:07 IST|Sakshi

ప్రభుత్వ లెక్క 4,062..  పరిహారమిచ్చింది 12వేల మందికి.. 

సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాల్లో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం.. మంగళవారం (18న) రాత్రి వరకు కరోనా వైరస్‌ సోకి చనిపోయినవారు 4,062 మంది మాత్రమే. కానీ సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 12 వేల మందికి పైగా కరోనా బాధిత కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించింది. ఇంకా పెద్దసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పొంతనలేని లెక్కలు చర్చనీయాంశమయ్యాయి 

కేంద్ర సాయం కోసం..: కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించా లని గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో  కరోనా మృతుల కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాటిని జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీల ద్వారా పరిశీలించి అర్హమైన దరఖాస్తులను ఎంపికచేసి, పరిహారమిస్తున్నారు.

పరిహారం కోసం ఇప్పటివరకు 28,969 దరఖాస్తులు రాగా.. అందులో 15,270 ఆమోదం పొందాయని, 12,148 మం దికి పరిహారం అందించామని ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్లలో వెల్లడిస్తున్న కరోనా మృతుల లెక్కల కంటే.. దరఖాస్తుల సంఖ్య ఏడెనిమిది రెట్లు ఎక్కువున్నాయి. కరోనా మృతుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు  సూచించిన క్రమంలోనే ఎక్కువ దరఖాస్తుల ను ఆమోదిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు