తెలంగాణలో తెరుచుకోనున్న థియేటర్లు

23 Nov, 2020 17:28 IST|Sakshi

థియేటర్ల పునః ప్రారంభానికి ఒకే అన్న ప్రభుత్వం

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కారు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కారణంగా గత పది నెలలుగా రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేరట్ల పునః ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 50 మంది ప్రేక్షకులతో కంటైన్మెంట్‌ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో థియేటర్లు తెరవవచ్చని తెలిపింది. సినిమా హాళ్లలో మాస్క్‌, శానిటైజర్‌ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. అలానే ఏసీ 24 నుంచి 30 డిగ్రీలు ఉండేలా చూడాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి షోకు ముందు థియేటర్ల పరిసరాలను శానిటైజేషన్‌ చేయడం తప్పనిసరి అని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి రానున్నాయి. (చదవండి: సినిమాను కాపాడండి)

ఇక ఇప్పటికే మేసిఫెస్టోలో కేసీఆర్‌ సినిమా థియేటర్ల యజమానులకు పలు వెసులుబాట్లు కల్పించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా టికెట్‌ ధర పెంచుకోవచ్చని తెలపడమే కాక విద్యుత్‌ కనీస డిమాండ్‌ ఛార్జీలు రద్దు చేస్తామని.. 10 కోట్ల రూపాయల లోపు బడ్జెట్‌ సినిమాలకు ఎస్‌జీఎస్‌టీ రీయింబర్స్‌మెంట్‌తో సాయం చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అధిక షోలు ప్రదర్శించేందుకు అనుమతిస్తామన్నారు.

మరిన్ని వార్తలు