సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్‌.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

26 Jan, 2023 07:52 IST|Sakshi

బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా కఠిన చర్యలు

ఫైర్‌సేఫ్టీపై ఉన్నతాధికారులతో కమిటీ

అవసరమైతే ఫైర్‌సేఫ్టీ చట్టానికి సవరణలు

మంత్రులు కేటీఆర్, తలసాని, మహమూద్‌ అలీ ఉన్నతస్థాయి సమీక్ష

దక్కన్‌ మాల్‌లో మరణించిన ముగ్గురి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం

సాక్షి, హైదరాబాద్‌: బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని భవ నాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రుల బృందం ఉన్నతాఅధికారులను ఆదేశించింది. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర అ న్ని ప్రధాన నగరాల్లోని బహుళ అంతస్తుల భవ నాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసు కునే చర్యలకు సంబంధించి ‘ఫైర్‌ సేఫ్టీ ఆడిట్‌’ నిర్వహించాలని నిర్దేశించింది. అగ్నిమాపక శాఖకు ఆధునిక సామగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం శాఖకు అవసరమైన అత్యవసర సా మగ్రికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని సూచించింది.

బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని మాపక చర్యలపై సందేహాలు తలెత్తిన నేప  థ్యంలో బుధవారం మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీ బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్‌కుమార్, సునీల్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి విపత్తులు సంభవించకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. సికింద్రాబాద్‌లోని డెక్కన్‌ మాల్‌లో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు బలైన నేపథ్యంలో ప్రభుత్వం ఈమేరకు చర్యలు చేపట్టింది. డెక్కన్‌ మాల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన ముగ్గురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని నిర్ణయించింది.

డ్రోన్‌ సాంకేతికతను వినియోగించండి
మునిసిపల్‌ నిబంధనల ప్రకారం ఐదంతస్తులు, ఆపై నిర్మించే భవనాల విషయంలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జర పడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతు న్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాలలోని వ్యాపార, వాణిజ్య భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఎత్తైన అపార్ట్‌మెంట్లలో సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అవసరమైతే ప్రస్తుతమున్న ఫైర్‌సేఫ్టీ చట్టాలను సవరించాలని చెప్పారు. హైదరాబాద్‌లో భారీగా నిర్మాణమవుతున్న బహుళ అంతస్తుల భవనాల ఫైర్‌ సేఫ్టీకి సంబంధించి డ్రోన్లు, రోబోటిక్‌ సాంకేతికతను వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు.

ఈ మేరకు పాశ్చాత్య దేశాలతోపాటు దేశంలోని ఇతర నగరాల్లో ఉన్న మెరుగైన పద్ధతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న అగ్నిమాపక సిబ్బందికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, వారిని నిష్ణాతులను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా భవనాల యజమానులను కూడా భాగస్వాములను చేసుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో ఇంకా జలమండలి ఎండీ దాన కిషోర్, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర , రాచకొండ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్, హైదరాబాద్‌ కలెక్టర్‌ అమేయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు