వ్యాక్సిన్లపై విజి'లెన్స్'

12 Jan, 2021 05:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్లు ఏమాత్రం పక్కదారి పట్టకుండా ఉండేందుకు, బ్లాక్‌ మార్కెట్లకు తరలకుండా ఉండటానికి గట్టి నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పటిష్టమైన విజిలెన్స్‌ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అన్ని కోల్డ్‌ చైన్‌ పాయింట్లు, కేంద్రాలకు వ్యాక్సిన్లను రవాణా చేసే సమయంలో, అన్ని టీకా కేంద్రాల వద్ద వాటికి భద్రత కల్పించేందుకు భారీ ఏర్పాట్లు చేయ నుంది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.   

కలెక్టర్లపైనే పూర్తి భారం... 
వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 16 నుంచి ప్రారంభం కానుండటంతో రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్లతో కేసీఆర్‌ సోమ వారం నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ల పంపిణీ, భద్రత సహా అన్నింటిలోనూ కలెక్టర్లే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో స్టేట్‌ స్టీరింగ్‌ కమిటీ (ఎస్‌ఎస్‌సీ) ఉంటుంది. దాని పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి నేతృత్వంలో స్టేట్‌ టాస్‌్కఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌), స్టేట్‌ కంట్రోల్‌ రూం (ఎస్‌సీఆర్‌) ఏర్పాటవుతాయి. రాష్ట్రస్థాయి కమిటీల పర్యవేక్షణలో కలెక్టర్లు పనిచేస్తారు. జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ కోసం కలెక్టర్లు చైర్మన్లుగా జిల్లా టాస్‌్కఫోర్స్‌ (డీటీఎఫ్‌), జిల్లా కంట్రోల్‌ రూం (డీసీఆర్‌) ఏర్పాటవుతాయి. ఇక మండల స్థాయిలో తహసీల్దార్లు చైర్మన్లుగా టాస్‌్కఫోర్స్‌లు, కంట్రోల్‌ రూంలు ఏర్పాటవుతాయి. 

టీకా కేంద్రాల ఏర్పాటు కీలకం... 
16న నిర్దేశించిన 139 చోట్ల టీకా ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. 18నుంచి పూర్తిస్థాయిలో 1,200 ఆసుపత్రులు, 1,500 కేంద్రాల్లో వారానికి 4 రోజులు టీకాలు వేయాల్సి ఉంటుంది. రెండు వారాలపాటు 3.17 లక్షల మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సిబ్బందికి టీకాలు వేస్తారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో కలెక్టర్లు నిమగ్నం కావాల్సి ఉంది. మూడు గదులుండే కేంద్రాలను గుర్తించాలి. తక్షణమే ఆయా టీకా కేంద్రాలను గుర్తించాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు