తాగునీటికే తొలి ప్రాధాన్యం

7 Jun, 2021 04:12 IST|Sakshi

సీఎం ఆదేశాల మేరకు  ఇరిగేషన్‌ శాఖ నిర్ణయం

‘మిషన్‌ భగీరథ’ కు ఇబ్బందుల్లేకుండా చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో  లభ్యతగా ఉన్న జలాల వినియోగంలో తొలి ప్రాధా న్యం ప్రజల తాగునీటి అవసరాలకే ఇవ్వాలని ఇరి గేషన్‌ శాఖ నిర్ణయించింది. సమృద్ధిగా వర్షాలు కురిసి రిజర్వాయర్లు, డ్యామ్‌లు, బ్యారేజీల్లో పూర్తి స్థాయిలో నీరు చేరే వరకు తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాతే సాగు అవసరాలకు నీటిని విడుదల చేయాలని ఇటీవలి సమీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు.   తాగునీటి అవసరాలు తీరుస్తున్న ‘మిషన్‌  భగీ రథ’కు నీటికొరత లేకుండా చూడాలని, ఈ మేరకు కనీస నీటిమట్టాల నిర్వహణను పక్కాగా చేపట్టా లని ఆదేశించిన నేపథ్యంలో అందుకనుగుణం గానే ముందుకు వెళ్లాలని ఇరిగేషన్‌ శాఖ నిర్ణయించింది.

శ్రీశైలంలో నీటిమట్టం తగ్గడంతో ఇక్కట్లు..
మిషన్‌ భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని 26 సెగ్మెంట్లకు నీరందించేందుకు ప్రాజెక్టుల నుంచి ఏటా 39.19 టీఎంసీల నీటిని వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నీటిని తీసుకునే క్రమంలో 37 ప్రాజెక్టుల్లో  కనీస నీటిమట్టాలను కూడా నీటిపారుదల శాఖ నిర్ధారిం చింది. ఈ మేరకు మట్టాలను నిర్వహిస్తూనే ఆయ కట్టు సాగు అవసరాలకు నీటి విడుదల కొనసా గిస్తున్నారు. ప్రస్తుతం నీటి సంవత్సరం పూర్తి కావ డంతో కొన్ని రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గాయి. శ్రీశైలం జలాలపై ఆధారపడ్డ కల్వకుర్తి లోని ఎల్లూరు రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. నిజానికి శ్రీశైలంలో కనీ సంగా 810 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే కల్వ కుర్తి పంపుల ద్వారా ఎల్లూరును నింపే అవకాశం ఉంటుంది.

ఇక్కడి నుంచే నాగర్‌కర్నూల్‌ జిల్లా తాగు అవసరా లకు ఏటా 7.13 టీఎంసీల నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం శ్రీశైలంలో మట్టం 807 అడుగులకు పడిపోయింది. దీంతో ఇక్కడి నుంచి నీటిని తీసుకోవడం కష్టంగా మారింది. ఇదే పరిస్థితి కొన్ని రిజర్వాయర్లలో నెలకొంది. మరోవైపు జూన్‌ నుంచి పంటల సాగు మొదలైతే నారుమళ్లకు నీటి డిమాండ్‌ ఉంటుంది. దీంతో తాగునీటికి పక్కకు పెట్టాకే సాగు అవసరాలకు ఇవ్వాలని సీఎం  ఇంజనీర్లకు సూచించారు. ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, మిడ్‌ మానేరు, కడెం, నిజాంసాగర్, సింగూరులలో తాగుకు అవసరమైన నీటి లభ్యత ఉంది.  

సాగర్‌తో కొంత ఊరట
సాగర్‌లో ప్రస్తుతం నీటిలభ్యత రాష్ట్రానికి  ఊరట నిచ్చేలా ఉంది. ప్రస్తుతం సాగర్‌లో 533 అడుగుల మట్టంలో 174 టీఎంసీల మేర నీటినిల్వ ఉంది.   కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 45 టీఎంసీల మేర ఉంది. 2020–21లో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకోలేనందున, 45 టీఎంసీల నీటిని 2021–22 ఏడాదికి క్యారీఓవర్‌ చేయాలని కృష్ణా బోర్డును తెలంగా ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో దీని పరిధిలో తాగునీటికి ఇక్కట్లు ఉండబోవని ఇరిగేషన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

మరిన్ని వార్తలు