హైకోర్టుకు నివేదిక సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం

27 Apr, 2021 15:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 1వ తేదీ నుంచి 25 వరకు రాష్ట్రంలో 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ఈనెల 25వ తేదీ వరకు 4.39 లక్షల ఆర్‌టీపీసీఆర్, 19.16లక్షల రాపిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి చెందినట్లు నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు అత్యల్పంగానే ఉందని, ఆ రేటు 3.5% ఉందని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. పరీక్షలు ఇంకా పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని గుర్తుచేసింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు కోవిడ్ నిబంధనలు పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. మద్యం దుకాణాలను ఆబ్కారీ అధికారులు తనిఖీలు చేస్తున్నారని పేర్కొంది. రాష్ట్రానికి 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేంద్రం కేటాయించినట్లు నివేదికలో వెల్లడించింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ చేరవేస్తున్నామని, రెమిడివిసిర్ సరఫరా పర్యవేక్షణకు ప్రీతిమీనాను నోడల్ అధికారిగా నియమించినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తన నివేదికలో పేర్కొంది. హైకోర్టు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్లు తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకే రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఈ నివేదికను పరిశీలించి హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

చదవండి: ఉద్యోగుల ఆశలపై మళ్లీ నీళ్లు
చదవండి: కోవిడ్‌ వ్యాక్సిన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

>
మరిన్ని వార్తలు