పంచాయతీలకు ‘కరెంటు’ షాక్‌

11 May, 2022 01:20 IST|Sakshi

పెరిగిన విద్యుత్‌ చార్జీలతో 15–20% అదనపు భారం

ప్రభుత్వ గ్రాంట్లలో అత్యధిక శాతం కరెంటు బిల్లుల చెల్లింపునకే..

అంతగా ఆదాయం లేని పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరం    

అభివృద్ధి పనులు, మరమ్మతులు చేపట్టేందుకు నిధుల కొరత

గతంలో మాదిరి విద్యుత్‌ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలంటున్న సర్పంచ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: పెరిగిన కరెంటు చార్జీలు గ్రామ పంచాయతీలకు పెనుభారంగా మారుతున్నాయి. అంతగా ఆదాయం లేని పంచాయతీలు, ఇతర చిన్న పంచాయతీలకు అసలు కరెంట్‌ చార్జీలు కట్ట డమే సమస్యగా ఉండగా తాజాగా పెరిగిన చార్జీ లతో మరింత భారం పడింది. తాజాగా పెరిగిన విద్యుత్‌ చార్జీలతో గతంలో కంటే 15–20 శాతం దాకా బిల్లులు పెరిగినట్టుగా అంచనా వేస్తున్నారు.

దీంతో తగినన్ని సొంత ఆదాయ వనరులు, నిధులు లేని గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచ రంగా తయారైంది. నేరుగా అందే 15వ కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల్లో సింహభాగం విద్యుత్‌ చార్జీలు చెల్లించేందుకే సరి పోతోందని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు, ఏవైనా మరమ్మతులు చేపట్టాలంటే నిధులు సరిపోవడం లేదని చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వచ్చిన వెంటనే వాటి నుంచి అప్పటికప్పుడే కరెంటు బిల్లుల చెల్లింపులు జరుగుతుండటంతో.. నిధులు ఒకచేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటు న్నట్టుగా తయారైందని అంతగా ఆదాయం లేని పంచాయతీల సర్పంచ్‌లు వాపోతున్నారు. 

అసలే ఆదాయం తగ్గి..
ఇసుక మైనింగ్, సీనరేజీ, భూముల విక్రయం, స్టాంప్‌ డ్యూటీల వసూలు ఇతర రూపాల్లో వచ్చే ఆదాయాన్ని రాకుండా చేయడంతో గ్రామ పంచా యతీలకు ఇప్పటికే ఆర్థిక వనరులు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో కరెంట్‌ చార్జీల పెంపుతో నిధులు కరువై ఎటూ పాలుపోవడం లేదని సర్పంచ్‌లు అంటున్నారు. గతంలో ఇద్దరు పారి శు«ధ్య కార్మికులతో పార్ట్‌టైంగా పని చేయించుకుని రూ.2 వేల చొప్పున చెల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు ఇద్దరికి నెల కు రూ.8 వేల చొప్పున చెల్లించాల్సి రావడంతో అది కూడా భారంగా మారిందని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల్లో గతం లో మాదిరి ప్రభుత్వమే కరెంటు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు కరెంట్‌ చార్జీలు భారంగా మార డంపై అభిప్రాయం చెప్పేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారు లెవరూ అందుబాటులోకి రాలేదు.

పన్నులు, సీనరేజీల ఆదాయం పంచాయతీలకే ఇవ్వాలి
పంచాయతీలకు ముందే కరెంట్‌ చార్జీలు కట్ట గలిగే ఆర్థికస్తోమత లేదు. ఇప్పుడు కరెంట్‌ బిల్లులు పెరగడంతో మరింత భారం పడుతోంది. అందువల్ల ప్రభుత్వమే ఈ బిల్లులు చెల్లించాలి. కాంగ్రెస్‌.

టీడీ పీల హయాంలో పంచాయతీల కరెంట్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేది. ఆ తర్వాత వీధిలైట్లకు తక్కువ పర్సంటేజీతో చార్జీలు తీసుకునేవారు. ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు బిల్లులు కట్టే అవకాశ ముండేది. ఇప్పు డలా లేదు. పన్నులు, సీనరేజీల ఆదాయం పంచాయతీలకే ఇవ్వాలి. 
– చింపుల సత్యనారాయణరెడ్డి,  అధ్యక్షుడు, తెలంగాణ పంచాయతీరాజ్‌ చాంబర్‌

బోర్ల వినియోగంతో బిల్లులు భారం
వీధిలైట్ల బిల్లుల చెల్లింపుతో పాటు మిషన్‌ భగీరథ నీళ్ల సరఫరా సరిగా లేక బోర్లు వినియోగించాల్సి రావడంతో ఆ బిల్లుల చెల్లింపు భారంగా మారింది. ఇదిగాక వినాయకచవితి, బతుకమ్మ, దసరా, మైసమ్మ, పోచమ్మ ఇతర పండుగలు, పబ్బాలు, జాతర్లకు, కార్యాలకు అదనంగా లైట్లు పెట్టక తప్పని పరిస్థితి ఉంది.

దీంతో కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. పంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు కలుపుకొని నెలకు రూ.లక్ష చిల్లర ఆదాయం వస్తుంది. అందులో రూ.15–20 వేల దాకా కరెంట్‌ బిల్లులు కట్టాల్సి వస్తోంది. 
– ఉప్పల అంజనీ ప్రసాద్, గోలిరామయ్యపల్లి సర్పంచ్, కరీంనగర్‌ జిల్లా  

మరిన్ని వార్తలు