భూములు లాక్కున్నట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా

3 Oct, 2021 02:40 IST|Sakshi
కోర్కల్‌లో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌ 

మేము తప్పు చేయలేదని తేలితే కేసీఆర్‌ రాస్తాడా? 

మాజీ మంత్రి ఈటల సవాల్‌

వీణవంక: ‘నా భార్య, నేను ఎవరినుంచైనా భూములు లాక్కున్నామని నిరూపిస్తే.. ముక్కు నేలకు రాస్తా. మేము తప్పు చేయలేదని తేలితే కేసీఆర్‌.. ముక్కు నేలకు రాస్తావా’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ సవాల్‌ విసిరారు. ‘ఎమ్మెల్యే, మంత్రి పదవి ఇచ్చినా సీఎం సీటుకు ఈటల ఎసరు పెట్టిండని హరీశ్‌రావు అంటున్నారు. ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెట్టానని నన్ను తీసేశారా..? లేక భూములు ఆక్రమించుకున్నానని తీసేశారా? ఏది నిజం, ఏది అబద్ధమో తేల్చాలి’అని అన్నారు.

శనివారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలోని కోర్కల్, నరసింహులపల్లి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీఆర్‌ఎస్‌ నేతల అండదండలతో అధికారులు పిచ్చి పనులు చేస్తే వారి భరతం పడతామని హెచ్చరించారు. ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు ఈటల వెంట తిరిగితే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారని, వీఆర్‌ఏ, వీఆర్‌వో, జీపీ కార్యదర్శులను సైతం బెదిరిస్తున్నారని అన్నారు.

ఐదు నెలలుగా నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, టీఆర్‌ఎస్‌ నాయకులు, ఎమ్మెల్యేలు ఊర్లను బార్లుగా మార్చారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ వాళ్లు బెదిరిస్తే బెదిరే వాళ్లు ఎవరూ లేరని, తిరగబడే వాళ్లు ఈటల వైపు ఉన్నారని పేర్కొన్నారు. అన్ని మండలాలు ఒక ఎత్తైతే వీణవంక మండలం ఒక ఎత్తు అని, వీణవంక ప్రజలు మర్యాదలకు లొంగుతారని, బెదిరిస్తే మాత్రం భరతం పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు