చెత్త.. వేస్ట్‌ కాదు వనరు!

21 Dec, 2021 02:50 IST|Sakshi
గ్యాస్‌ సిలిండర్‌లను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌రావు, బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ 

సిద్దిపేటలో బయో–సీఎన్‌జీ ప్లాంట్‌ ప్రారంభం

సాక్షి, సిద్దిపేట: ప్రజల భాగస్వామ్యం, పారిశుధ్య కార్మికుల పనితనంతో స్వచ్ఛతలో సిద్దిపేట దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్‌ మండలం బుస్సాపూర్‌లో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన బయో–సీఎన్‌జీ ప్లాంట్‌ను సోమవారం ఆయన బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలసి ప్రారంభించారు.

తడి చెత్తతో ఈ ప్లాంట్‌లో బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. రాష్ట్రంలో ఈ తరహా ప్లాంట్‌ ఇదే మొదటిది కావడం గమనార్హం. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బయో–సీఎన్‌జీ ప్లాంట్‌ ఏర్పాటుకు బలం, బలగం సిద్దిపేట పుర ప్రజలేనని పేర్కొన్నారు. భారీగా పోగవుతున్న చెత్త కారణంగా ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోందని, భూమి, నీరు కలుషితం అవుతున్నాయని అన్నారు.

సిద్దిపేట పట్టణంలో రోజుకు 55 వేల కిలోల చెత్త పోగవుతోందని, అయితే సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా ప్రజల భాగస్వామ్యం, స్థానిక ప్రజా ప్రతినిధుల కృషితో సిద్దిపేట స్వచ్ఛ పట్టణంగా రూపుదిద్దుకుందని వివరించారు. తాము చెత్తను ఆదాయ వనరుగా మార్చామన్నారు. బయో –సీఎన్‌జీ ప్లాంట్‌లో త యారయ్యే గ్యాస్‌ను పట్టణంలో హోటళ్లకు సరఫరా చేస్తామ ని చెప్పారు. అలాగే మున్సిపల్‌ వాహనాలకు ఇంధనంగా ఈ సీఎన్‌జీ గ్యాస్‌ను ఉపయోగిస్తామని మంత్రి వెల్లడించారు.  

స్వచ్ఛతలో రాష్ట్రానికి ఆదర్శం సిద్దిపేట..  
స్వచ్ఛత విషయంలో సిద్దిపేట జిల్లా తెలంగాణకే ఆదర్శంగా నిలిచిందని బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ అన్నారు.« నాయకుల ధృడ సంకల్పం, దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకోవడం గొప్ప విషయం అన్నారు. ప్రసంగం ప్రారం భంలో ఆయన సభకు నమస్కారం.. అని తెలుగులో మాట్లా డి సభికులను ఆకట్టుకున్నారు. అనంతరం ప్లాంట్‌లో తిరు గుతూ ఫొటోలు తీసుకున్నారు.  

చెత్త రహిత వార్డుకు తులం బంగారం 
సిద్దిపేటజోన్‌: సిద్దిపేట పట్టణంలో చెత్త రహిత వార్డు.. ఘనత సాధించే కౌన్సిలర్‌కు తులం బంగారం, వార్డు రిసో ర్స్‌ పర్సన్‌కు ఒక పట్టుచీరను బహుమతిగా ఇస్తా మని మం త్రి హరీశ్‌రావు ప్రకటించారు. సోమవారం రాత్రి మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తో ఆయన సమీక్ష నిర్వహిం చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో రాత్రి పూట కొందరు రోడ్లపై చెత్త వేయడం వల్ల రోడ్లు అపరిశుభ్రంగా మారుతున్నాయని, అలాంటి ఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాలని హరీశ్‌రావు అధికారులకు సూచించారు.

బయో సీఎన్‌జీ తయారీ ఇలా..  
ఇంటింటా సేకరించిన తడిచెత్తను తొలుత క్రషింగ్‌ చేస్తారు. అనంతరం పైప్‌ ద్వారా ప్రి–డిజాస్టర్‌ ట్యాంక్‌లోకి పంపిస్తారు. దాన్ని మూడ్రోజులు నిల్వ ఉంచు తారు. అది ద్రావణంగా మారాక మరో ట్యాంక్‌లోకి పం పిస్తారు. అనంతరం అందులో మైక్రో ఆర్గాన్లు కలుపుతారు. ఆ సమయంలో విడుదలయ్యే మీథేన్‌ గ్యాస్‌ నుంచి సీఎన్‌జీని వేరుచేసి సిలిండర్లలో నింపుతారు.

మరిన్ని వార్తలు