లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్‌

7 Apr, 2021 18:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని, లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే లక్షయాభైవేల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల పరిధిలో ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామాల్లోని పీహెచ్‌సీ( PHC) స్థాయి వరకు కూడా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని గాంధీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. 11 వేల బెడ్స్‌ని ఆక్సిజన్ బెడ్స్‌గా మళ్లీ పునరుద్ధరించామని చెప్పారు.

అత్యవసర సమయంలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. ఆరోగ్య శాఖలో ఇప్పటికే అన్ని విభాగాల్లోని అధికారులు సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నారని అన్నారు. కరోనాతో సహజీవనం తప్పదని పేర్కొన్నారు.  ప్రజలు కూడా వారి వంతుగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్‌ నిబంధనలను పాటించాలని కోరారు.  

చదవండి: ఢిల్లీ నైట్‌ కర్ఫ్యూ: ఎవరికి సడలింపు..?
 

మరిన్ని వార్తలు