కొట్టుకుపోతున్న రోడ్లు

13 Jul, 2022 00:48 IST|Sakshi
 పెద్దంపేట వాగు వరద తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయిన రోడ్డు   

తెరిపివ్వని వానతో రహదారులకు తీవ్ర నష్టం

26 చోట్ల జాతీయ రహదారులు, 65 ప్రాంతాల్లో రాష్ట్ర రహదారులకు నష్టం

రూ.90 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా

సాక్షి, హైదరాబాద్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రోడ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత రెండు వానాకాలాల్లో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లకు నిధుల్లేక పూర్తిస్థాయి మరమ్మతులు చేయని తరుణంలో.. ఈసారి కూడా విరుచుకుపడు తున్న వానలు మరోసారి రోడ్లను ఛిన్నా భిన్నం చేస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పోటెత్తి రోడ్లను ముంచెత్తాయి.

రోడ్ల మీదు గా దూసుకుపోతున్న వరద ఎక్కడికక్కడ రహదారులను కోస్తోంది. గత రెండేళ్లలో జాతీయ రహదారులకు పెద్దగా ఇబ్బంది కలగనప్పటికీ, ఈసారి కొన్ని చోట్ల అవి కూడా భారీగానే దెబ్బతిన్నాయి. ఇక రాష్ట్ర రహదారులు యథావిధిగా తీవ్రంగానే దెబ్బతిన్నాయి. దాదాపు 65 ప్రాంతాల్లో రాష్ట్ర రహదారులు, 26 చోట్ల జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్ర రహదారులకు రూ.70 కోట్ల మేర, జాతీయ రహదారులకు రూ.20 కోట్ల వరకు నష్టం కలిగింది.

అధికారులు ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా యుద్ధప్రా తిపదికన పనులు ప్రారంభించారు. రోడ్లు భవనాల శాఖ వద్ద అందుబాటులో ఉన్న రూ.5.5 కోట్ల నిధులతో పునరుద్ధరణ పను లు చేపట్టారు. జాతీయ రహదారులను రూ.11 కోట్లతో పునరుద్ధరిస్తున్నారు. ఇలాగే మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు కొనసాగితే రోడ్లు మరింతగా దెబ్బతింటాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఎక్కడెక్కడంటే...
హైదరాబాద్‌–భూపాలపట్నం జాతీయ రహదారిపై టేకులగూడెం వద్ద గోదావరి బ్యాక్‌వాటర్‌తో 200 మీటర్ల మేర 2 మీటర్ల ఎత్తుతో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ఇక్కడ 100 మీటర్ల పొడవుతో హైలెవెల్‌ బ్రిడ్జి నిర్మించాలని తాజాగా నిర్ణయించారు.

నిజామాబాద్‌–జగ్దల్‌పూర్‌ జాతీయ రహదారి మంచిర్యాల సమీపంలోని లక్ష్మీపురం వద్ద 2 మీటర్ల చొప్పున రెండు ప్రాంతాల్లో పూర్తిగా కోసుకుపోయింది. భారీగా వచ్చిన వరద సమీపంలోని లక్ష్మీపురం గ్రామాన్ని ముంచెత్తే సమయంలో ఈ రోడ్డు కోతకు గురైంది. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

ఖమ్మం–కురవి మధ్య మోదుగుల గూడెం వద్ద జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతింది. భారీ గోతులు ఏర్పడి వాహనాలు ముందుకు సాగడం కష్టంగా మారింది.

బోధన్‌–బాసర మధ్య యాంచ గ్రా మం వద్ద జాతీయ రహదారి ఓ పక్క న భారీగా కోతకు గురైంది. నిజామా బాద్‌–బోధన్‌ మధ్య జానకంపేట వద్ద రెండుపక్కల జాతీయ రహదారి కొట్టుకుపోయింది. 

మహదేవ్‌పూర్‌–కనకనూరు–కాటారం రోడ్డును గోదావరిలో కలిసే పెద్దవాగు వరద తీవ్రంగా దెబ్బతీసింది. పలిమెల వద్ద 15 మీటర్ల మేర, యామన్‌పల్లి– మహాముత్తారం వద్ద 90 మీటర్ల మేర రహదారి పూర్తిగా కోసుకుపోయింది. 

మరిన్ని వార్తలు