TS Inter 1st Year Exams: ఇంటర్‌ పరీక్షలు ఆపలేం: తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ

22 Oct, 2021 15:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇంటర్‌ పరీక్షలు ఆపలేమని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. ఇంటర్‌ బోర్డ్‌ పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.
చదవండి: TS Inter 1st Year Exams: ఇంటర్‌ పరీక్షలు.. ఇక డొంక తిరుగుడు ప్రశ్నలుండవ్‌! 

ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని, పిటిషన్ దాఖలు చేయడంలో ఆలస్యమైనందని హైకోర్టు పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పిటిషన్ వెనక్కి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. కాగా తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ఫస్టియర్‌ పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దు చేయాలని గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
చదవండి: హైదరాబాద్‌లో దృశ్యమైన బాలుడు అనీష్‌ మృతి

పేరేంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. ఇంటర్ ఫస్టియర్ ప్రమోటైన విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించవద్దని పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 58 మంది ఇంటర్ విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాయనున్నారు.

మరిన్ని వార్తలు