సర్కారు భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

18 Feb, 2022 03:56 IST|Sakshi

పారదర్శక విధానాలు పాటించాలన్న హైకోర్టు

మాజీ ఎంపీ విజయశాంతి పిటిషన్‌ కొట్టివేత

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. భూములను విక్రయించడానికి వీల్లేదని చట్టంలో ఎక్కడా లేదని, ఈ నేపథ్యంలో తాము వేలం ప్రక్రియను నిలిపి వేయలేమని స్పష్టం చేసింది. అయితే టెండర్లు, ఈ వేలం లాంటి పారదర్శక పద్ధతుల్లో భూములను వేలం వేయాలని తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది.

భూముల వేలాన్ని నిలిపివేయాలంటూ మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి శుక్లా దాఖలు చేసిన పిల్‌ను కొట్టివేసింది. కోకాపేట, ఖానామెట్‌లో ప్రభుత్వ భూములను అక్రమార్కుల నుంచి కాపాడలేకపోతున్నామని పేర్కొంటూ ప్రభుత్వం వేలం వేయడాన్ని విజయశాంతి సవాల్‌ చేశారు. అయితే ఏ చట్టం ప్రకారం ప్రభుత్వ భూములను విక్రయించరాదో చెప్పాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. భూముల విక్రయ నిషేధానికి ఎలాంటి చట్టం లేనప్పుడు తాము భూముల వేలాన్ని నిలిపివేస్తూ ఎలా ఉత్తర్వులు జారీ చేయగలమని ప్రశ్నించింది.  

మరిన్ని వార్తలు