‘దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు లేదు’

10 Aug, 2020 13:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయంలోని పురాతన ఆలయం, మసీదు కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్‌ నేతల దరఖాస్తులపై ఏం చేశారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తమ దరఖాస్తులపై డీజీపీ, సీపీ స్పందించడం లేదని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. పురాతన ఆలయం, మసీదు పొరపాటున కూలిపోయాయని ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్ నేతల న్యాయవాది కోర్టు తెలిపారు. పొరపాటున జరిగిందా? ఉద్దేశపూర్వకంగా కూల్చారా? అనే దానిపై పరిశీలిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు.

దర్యాప్తు చేసే అధికారం ప్రజా ప్రతినిధులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏజీ హోం క్వారంటైన్‌లో ఉన్నందున రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. కూల్చీవేతలపై విచారణ జరపాలని పురావస్తు శాఖను కోరడానికి అడ్డంకి ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు