POP Ganesh Idols: గణేశ్‌ విగ్రహాల తయారీపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

21 Jul, 2022 19:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే(బేబి పాండ్స్‌) పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయాలని పేర్కొంది. కాగా  గతేడాది కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) పీవోపీ విగ్రహాల నిషేధంపై మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ విగ్రహాల తయారీదారులు హైకోర్టును ఆశ్రయించారు. కరోనాకు ముందు విగ్రహాలను తయారు చేశామని, కనీసం వాటినైనా అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై  విచారించిన కోర్టు.. ఇందులో తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పీసీబీ కేవలం మార్గదర్శకాలను మాత్రమే జారీ చేసిందని, ప్రభుత్వం పీవోపీ విగ్రహాలపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయలేనందున తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. దుర్గాపూజపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ మార్గదర్శకాలను పరిశీలించాలని సూచించింది.
చదవండి: కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేం: కేంద్రం

మరిన్ని వార్తలు