ప్రత్యక్ష ప్రసారాలకు సీజే ఆమోదం 

6 May, 2022 04:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసార నిబంధనలకు ప్రధాన న్యాయమూర్తి ఆమో దం తెలిపారు. ఈ నిబంధనలను, కోర్టు కార్య కలాపాల రికార్డింగ్‌ను అధికారిక గెజిట్‌లో ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. 2022, మే 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ప్రత్యక్ష ప్రసారాల నిబంధన లను రూపొందించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ అడ్వొకేట్‌ శ్రీలేఖ పూజారి గత సంవత్సరం అత్యున్నత న్యాయస్థానంలో పిల్‌ వేశారు.

దీనిపై వివరణ ఇవ్వా లని హైకోర్టు పాలన విభాగాన్ని సుప్రీంకోర్టు ఈ ఫిబ్రవరిలో ఆదేశించింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఈ మేరకు చర్యలు చేపట్టింది. ముఖ్యమైన కేసుల ప్రత్యక్ష ప్రసారాలకు 2018లో సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అయితే అది ఇంకా చాలా హైకోర్టుల్లో అమలుకావడం లేదు. గుజరాత్‌ హైకోర్టు తొలిసారి లైవ్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, పట్నా హైకోర్టుల్లో కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారమవుతోంది. వీటిని యూట్యూబ్‌లోనూ అప్‌లోడ్‌ చేస్తున్నారు.  


 

మరిన్ని వార్తలు