మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

28 Jan, 2023 01:04 IST|Sakshi

మెడికల్‌ ఫీజుల కేసులో తీర్పు ఎందుకు అమలు చేయలేదు..

వివరణ ఇవ్వాలని ఆదేశించిన న్యాయస్థానం

సాక్షి, హైదరాబాద్‌: పీజీ మెడికల్‌ ఫీజులకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలంటూ రాష్ట్ర మంత్రి, మమతా ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ పువ్వాడ అజయ్‌ కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 17వ తేదీకి వాయిదా వేసింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దని, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (ఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన మేరకే వసూలు చేయాలని పలు కాలేజీలను ఆదేశిస్తూ ఓ రిట్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు 2022లో ఉత్తర్వులు ఇచ్చింది.

ఒకవేళ అధిక ఫీజు వసూలు చేస్తే దాన్ని తిరిగి ఇచ్చేయాలని స్పష్టంచేసింది. అలాగే విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా ఇచ్చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను మమతా కాలేజీ యాజమాన్యం పాటించకపోవడంతో వరంగల్‌కు చెందిన డాక్టర్‌ నిఖిల్‌ గుర్రపు కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది సామ సందీప్‌రెడ్డి వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాలను మమతా కాలేజీ పలు కాలేజీలు కావాలనే పాటించలేదని.. దీంతో విద్యార్థులు అధిక ఫీజు చెల్లించాల్సి వచ్చిందన్నారు. వెంటనే ఆ ఫీజు తిరిగి ఇచ్చేలా కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. మంత్రి పువ్వాడకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది.   

చదవండి: సాహితీ ఇన్‌ఫ్రా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..

మరిన్ని వార్తలు