కోవిడ్‌ నిర్వహణపై విచారణ.. ప్రభుత్వంపై ఆగ్రహం

4 Sep, 2020 15:15 IST|Sakshi

ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కోవిడ్ నిర్వహణపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ తీరు పట్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేట్‌ హాస్పటల్ ఓవర్ చార్జీలపై ఈ నెల 22న రిపోర్టు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఎన్ని ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చారు.. చర్యలపై నివేదిక సమర్పించాలని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారని కోర్టు ప్రశ్నించింది. 50శాతం బెడ్స్‌పై ఢిల్లీ మాదిరిగా వ్యవహరించాలి. తెలంగాణలో ఎలా చేశారో నివేదిక ఇవ్వాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజాస్టార్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి.. దానితో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని కోర్టు ఆదేశించింది. పబ్లిక్ హెల్త్‌పై మార్చి 24 కు ముందు ఎంత ఖర్చు చేశారు. ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టారో నివేదిక ఇవ్వాలన్నది. (చదవండి: ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?)

అంతేకాక తెలంగాణ కోవిడ్‌ డెత్ రిపోర్ట్స్‌పై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి రోజు 8 నుంచి 10 మంది మాత్రమే చనిపోతున్నారా.. అని ప్రశ్నించింది. కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారు. మార్చి నుంచి ఇదే విధంగా వ్యవహారిస్తున్నారు అంటూ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితమైన రిపోర్టులు సమర్పించాలని.. తప్పుడు నివేదికలు ఇస్తే మళ్లీ సీఎస్‌ని కోర్టుకు పిలువాల్సి వస్తుందని హెచ్చరించింది.ఈ నెల 22వరకు రిపోర్టులన్ని నివేదించాలని సూచించింది. ఆస్పత్రుల్లో సిబ్బంది, మౌళిక సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన్న ధర్మాసనం. తదుపరి విచారణ 24 కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు