ఎయిర్‌టెల్‌ రూ.2,000 కోట్ల పెట్టుబడి.. హైదరాబాద్‌లో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌

19 Jan, 2023 09:04 IST|Sakshi

దావోస్‌ వేదికగా ప్రకటించిన భారతీ గ్రూప్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్, ఎండీ రాజన్‌ భారతీ మిట్టల్‌.. 

జీనోమ్‌ వ్యాలీలో ఫ్రాన్స్‌కు చెందిన యూరోఫిన్స్‌ అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటుకు ఓకే 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో టెలికం రంగంలోని అగ్రగామి సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ హైదరాబాద్‌లో రూ. 2వేల కోట్ల భారీ పెట్టుబడితో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. డేటా స్టోరేజ్, విశ్లేషణలో అత్యాధునిక సాంకేతికత అయిన హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ను తన అనుబంధ సంస్థ అయిన ‘నెక్స్‌ ట్రా’ ద్వారా భారతీ ఎయిర్‌టెల్‌ నెలకొల్పనుంది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 2వేల కోట్లను పెట్టుబడిగా పెడుతామని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆహారం, పర్యావరణం, ఔషధాలు, కాస్మోటిక్స్‌ పరీక్షల సంస్థ యూరోఫిన్స్‌.. జీనోమ్‌ వ్యాలీలో అధునాతన ప్రయోగశాల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 

–దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవీలియన్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్, వైస్‌ చైర్మన్, ఎండీ రాజన్‌ భారతీ మిట్టల్, యూరోఫిన్స్‌ సీఈవో డాక్టర్‌ గిల్లెస్‌ మారి్టన్‌లు విడివిడిగా సమావేశమయ్యారు. సమావేశానంతరం 60 మెగావాట్ల సామర్థ్యంతో ఈ హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. డేటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ డేటాసెంటర్‌ రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె.రామారావు మాట్లాడుతూ ఎయిర్‌టెల్‌–నెక్స్‌ ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ మౌలిక సదుపాయాలు కలి్పంచడంలో ఎయిర్‌ టెల్‌– నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని తెలిపారు. 

–భారతీ ఎయిర్‌టెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ లో ఏర్పాటు చేయబోయే హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా పేర్కొన్నారు. 2022 మే లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో ప్రారంభమైన డేటా సెంటర్‌ ఏర్పాటు చర్చలు నెలల వ్యవధిలోనే కార్యరూపం దాల్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి కారణమన్నారు. 

జీనోమ్‌ వ్యాలీలో..యూరోఫిన్స్‌ ప్రయోగశాల... 
హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రయోగశాల (టెస్టింగ్‌ ల్యాబ్‌) ఏర్పాటు చేయనున్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన యూరోఫిన్స్‌ ప్రకటించింది. ఆహారం, పర్యావరణం, ఫార్మా, కాస్మెటిక్‌ ఉత్పత్తుల పరీక్షలతో పాటు బయో అనలిటికల్‌ టెస్టింగ్‌లో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న యూరోఫిన్స్‌ హైదరాబాద్‌లో అధునాతన ప్రయోగశాలను నెలకొల్పాలని నిర్ణయించింది. తద్వారా భారతీయ ఔషధ మార్కెట్‌లోకి విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది. 90,000 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ అత్యాధునిక ప్రయోగశాలలో సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎనలిటికల్‌ ఆర్‌ అండ్‌ డీ, బయో అనలిటికల్‌ సరీ్వసెస్, ఇన్‌–వివో ఫార్మకాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ రంగాలకు చెందిన దేశ, విదేశ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలతో పాటు చిన్న బయోటెక్‌ కంపెనీలకు అవసరమైన సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించింది. తన అనుబంధ సంస్థ ‘యూరోఫిన్స్‌ అడ్వినస్‌’ ద్వారా హైదరాబాద్‌లో ఈ ప్రయోగశాలను యూరోఫిన్స్‌ ఏర్పాటు చేయనుంది. ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌తో పాటు ఇన్‌–విట్రో, ఇన్‌–వివో బయాలజీ విభాగాల్లో తన సేవలను విస్తరించేందుకు 2023 వ సంవత్సరం ప్రారంభం నుంచే యూరోఫిన్స్‌ అడ్వినస్‌కు ఈ ల్యాబ్‌తో అవకాశం కలుగుతుంది. 

ఔషధాల తయారీలో భారత్‌ ప్రాధన్యతను గుర్తించే...: గిల్లెస్‌ మార్టిన్‌   
ఈ సందర్భంగా యూరోఫిన్స్‌ సీఈఓ డాక్టర్‌ గిల్లెస్‌ మారి్టన్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంతో పాటు లే»ొరేటరీ నెట్‌వర్క్‌ను మరింత సుస్థిరం చేసుకునే దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఔషధాల పరిశోధన, తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ క్యాంపస్‌ ద్వారా ఔషధాల అభివృద్ధి, ఆవిష్కరణల్లో కీలకం కానున్నట్లు చెప్పారు. కాగా హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలోకి యూరోఫిన్స్‌ ప్రవేశించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తమ విస్తరణ–వృద్ధి ప్రణాళికల కోసం హైదరాబాద్‌ ను ప్రధాన కేంద్రంగా యూరోఫిన్స్‌ పరిగణిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శక్తి ఎం నాగప్పన్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు