కరో కరో జల్సా.. కరోనా ముప్పుంది తెల్సా..? కొత్త వేడుకల వేళ జాగ్రత్త సుమా..!

30 Dec, 2022 07:49 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరం నయా సాల్‌ వైపు కొత్త ఉత్సాహంతో ఉరకలేస్తోంది. నూతన సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పేందుకు హుషారుగా సిద్ధమవుతోంది. మరోవైపు కొత్త సంవత్సరారంభంలోనే పాత శత్రువు నేనున్నానంటూ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో గతానుభవాలను మర్చిపోకుండా స్వాగత సంబరాలను ఆస్వాదించడం అవసరం అంటున్నారు నిపుణులు. గృహమే కదా స్వర్గసీమ అన్నట్టుగా జీతమిచ్చే పని దగ్గర నుంచీ జీవితాన్ని రంజింపజేసే వేడుకల దాకా అన్నింటికీ ఇల్లే చిరునామాగా మారింది. కోవిడ్‌ పుణ్యమాని ఇంట్లో గడిపే సమయంతో పాటు ఇంట్లోనే విందు వినోదాలు చేసుకునే అలవాటు పెరిగింది. కాబట్టి వీలున్నంత వరకూ బంధుమిత్రులను కలుపుకొని ఇంట్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం మంచిది.

అవుట్‌ డోర్‌.. నగరంలోని హోటల్స్, పబ్స్, క్లబ్స్‌ వంటి చోట్ల న్యూ ఇయర్‌ ఈవెంట్లు చాలా వరకూ నాలుగు గోడల మధ్యనే జరుగుతాయి. పూర్తి ఎయిర్‌ కండిషన్డ్‌ హాల్స్, అంతంత మాత్రం వెంటిలేషన్‌ తప్పదు. అంతేకాకుండా సామర్థాన్ని మించి అతిథులు కిక్కిరిసిపోయే అవకాశాలూ ఎక్కువ. అలాంటి చోట్ల వైరస్‌ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకూ అవుట్‌ డోర్‌ ఈవెంట్లనే ఎంచుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. స్కూళ్లకు వెళ్లే చిన్నారులు, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాల ఆరోగ్య సమస్యలున్న 60ఏళ్లు పైబడినవారు, గర్భిణులు, పాలిస్తున్న తల్లులు.. ఈ భారీ సమూహాలతో జరిగే ఈ వేడుకలకు దూరంగా ఉండాలి.

నిర్వాహకులూ.. జాగ్రత్తలూ.. తాము తీసుకోవడంతో పాటు 2 డోస్‌ల వ్యాక్సినేషన్, అలాగే బూస్టర్‌ డోస్‌ కూడా తీసుకున్న సిబ్బందినే వేడుకల నిర్వాహకులు అతిథుల కోసం వినియోగించడం మంచిది. రద్దీ, తోపులాటల నివారణకు గాను ఒకటి కంటె ఎక్కువగా బహుళ ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. హాజరయ్యేవారు తప్పకుండా ఫేస్‌ మాస్క్‌ ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి. దీని కోసం నో మాస్‌్క, నో ఎంట్రీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈవెంట్లకు దగ్గరలో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచడం కూడా మంచిదే.

పరిమితాహారం.. అమితారోగ్యం.. అవసరాన్ని బట్టి మాస్‌్కలు, శానిటైజర్స్‌ వెంట తీసుకువెళ్లాలి. సాధ్యమైనంత వరకూ సామాజిక దూరం పాటించాలి. వైరస్‌ ఇన్ఫెక్షన్‌కు గురి కాకుండా ఉండేందుకు రోగనిరోధకతను కోల్పోకుండా జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇది. దీనికోసం ఇలాంటి వేడుకల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మితాహారం తీసుకోవడం ఎంతో మంచిది. అలాగే మద్యం తీసుకునే అలవాటు ఉంటే కూడా నియంత్రించుకోవాల్సిన అవసరముంది. ఇటీవల చాలా మందికి ఫుడ్‌ ఎలర్జీలు బాగా పెరిగాయి. ఫుడ్‌ ఎలర్జీలు చాలా చేటు చేస్తాయి. కాబట్టి విభిన్న రకాల ఆహారపదార్ధాలు వడ్డిస్తారు. ఏది పడితే అది తినకుండా ఉండడం మేలు.
– డా.బి.గౌరీశంకర్, ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి

కూల్‌ వెదర్‌.. టేక్‌ కేర్‌... ఇప్పుడు నగరంలో బాగా చల్లటి వాతావరణం ఉంది. దీనివల్ల ఫ్లూ, వైరల్‌ ఇన్ఫెక్షన్లు నగరవాసుల్ని వెంటాడుతున్నాయి. దీనికి తోడుగా కొత్త కరోనా వేరియంట్‌ వస్తోంది అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. వీలైనంత వరకూ భారీ సమూహాలు ఉండే చోటికి వెళ్లకపోవడం మంచిది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రత్యేకత ఏమిటంటే ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మందికి వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి భారీ జనసమూహాలకు దూరంగా ఉండడం మంచిది. అవసరాన్ని బట్టి డబుల్‌ మాస్క్‌ పెట్టుకోవాలి. వైరస్‌ ముక్కు నుంచే వెళుతుంది కాబట్టి కొత్తగా వచి్చన ముక్కు ద్వారా తీసుకునే వైరస్‌ నిరోధక డ్రాప్స్‌ వాడడం చాలా మేలు చేస్తుంది.
 -డా.కె.శివరాజు, కిమ్స్‌ ఆసుపత్రి
చదవండి:  న్యూ ఇయర్‌ వేడుకలు.. మందుబాబులకు గుడ్‌ న్యూస్‌

మరిన్ని వార్తలు