Hyderabad: ఓఆర్‌ఆర్‌.. రింగ్‌మెయిన్‌.. మెట్రో.. ఆ గ్రామాలు, నగరపాలక సంస్థలకు మహర్దశ 

26 Dec, 2022 09:05 IST|Sakshi

158 కి.మీ విస్తరించిన ఔటర్‌రింగ్‌ రోడ్డు

దీని చుట్టూ భారీ తాగునీటి పైపులైన్‌ ఏర్పాటు

ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రో ప్రతిపాదనలు

ఔటర్‌ కేంద్రంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులు

నగరం శరవేగంగా విస్తరిస్తుండడమే కారణం

ఓఆర్‌ఆర్‌ లోపలి గ్రామాలు, నగరపాలక సంస్థలకు మహర్దశ

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ అభివృద్ధి ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ చక్కర్లు కొడుతోంది. పలు కీలక ప్రాజెక్టులు, ప్రతిపాదనలు.. సర్కారు ప్రణాళికలు ఈ రహదారి కేంద్రంగానే సాగుతున్నాయి. మహా నగరానికి మణిహారంలా 158 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ నగరం నలుమూలలకు కృష్ణా, గోదావరి జలాలను కొరత లేకుండా సరఫరా చేసేందుకు భారీ తాగునీటి పైపులైన్‌ ఏర్పాటుకు గతంలో ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. తాజాగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎక్స్‌ప్రెస్‌ మెట్రో మార్గం ఏర్పాటుకు పునాది రాయి వేసిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఔటర్‌ చుట్టూ మెట్రో ప్రతిపాదన చేయడంతో ఈ అంశం సైతం సర్వత్రా చర్చనీయాంశమైంది. 

పైపులైన్‌ ఏర్పాటు ఇలా.. 
గ్రేటర్‌కు మణిహారంలా ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ జలహారం ఏర్పాటు పనుల్లో ఇప్పటికే సుమారు 48 కి.మీ మేర పనులు పూర్తయ్యాయి. మరో 110 కి.మీ మార్గంలో పనులు చేపట్టాల్సి ఉంది. పనుల పూర్తికి రూ.4,725 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసింది. ప్రస్తుతం నగరానికి ఎల్లంపల్లి (గోదావరి), కృష్ణా జలాలను సరఫరా చేస్తున్నారు. ఈ జలాలను నగరం చుట్టూ మణిహారంలా ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ 3,000 ఎంఎం డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్‌ ఏర్పాటు చేసి వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేయాలి. దీంతో నగరం నలుమూలలకు కొరత లేకుండా తాగునీటిని సరఫరా చేయవచ్చు. గతంలో పూర్తిచేసిన 48 కి.మీటర్లకు అదనంగా  మరో 110 కి.మీ మార్గంలో పనులు చేపట్టాల్సి ఉంది. జలాల నిల్వకు వీలుగా రెండు భారీ మాస్టర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లను సైతం నిర్మించాల్సి ఉంటుంది. వీటిలో కృష్ణా, గోదావరి జలాలను నిల్వ చేయాలి. 

ఔటర్‌కు మెట్రో హారం.. 
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ మెట్రో మార్గం దాదాపు 20 కిలోమీటర్ల మేర ఔటర్‌కు ఆనుకొనే వెళ్లనుంది. ఇక ఓఆర్‌ఆర్‌ లోపల కీలక ప్రాంతాలను అనుసంధానిస్తూ ఔటర్‌ చుట్టూ మెట్రో మార్గం ఏర్పాటు చేసిన పక్షంలో ఓఆర్‌ఆర్‌ లోపలున్న 190 గ్రామాలు, 30కి పైగా నగరపాలక సంస్థలకు కనెక్టివిటీ పెరగడంతో పాటు ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫారా>్మ, బయోటెక్,తయారీ రంగం, లాజిస్టిక్స్, హార్డ్‌వేర్, ఏవియేషన్‌ తదితర రంగాల సత్వర, సమగ్ర అభివృద్ధికి బాటలు పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అభివృద్ధిలో మహానగరం జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతుండడంతో ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు పలు అభివృద్ధి ప్రాజెక్టులు, రియలీ్ట, నిర్మాణ రంగ ప్రాజెక్టులు విస్తరించిన నేపథ్యంలో మెట్రో కనెక్టివిటీ ఆయా ప్రాంతాలకు అత్యావశ్యకమని విశ్లేషిస్తున్నారు.
చదవండి: గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ కుంభకోణం?

మరిన్ని వార్తలు